కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్, కేంద్రం మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే ఉన్నది. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇవాళ ఇద్దరు బెంగాల్ మంత్రులను సీబీఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ.. కాసేపటి క్రితం సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. సీఎం మమతా బెనర్జీ క్యాబినెట్లోని ఫిర్హద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నారద బ్రైబరీ కేసులో వారిని అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం 9 గంటలకు మంత్రి ఇంటికి వెళ్లి ఫర్హద్ హకీమ్ను కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. తృణమూల్ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మరో నేత సోవన్ ఛటర్జీ ఇండ్లకు కూడా కేంద్ర బలగాలు వెళ్లాయి.
నలుగురు తృణమూల్ నేతలపై విచారణ చేపట్టేందుకు సీబీఐకి ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ అనుమతి ఇచ్చారు. స్పెషల్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ.. ఆ తర్వాత వారిని కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి సీఎం అయిన మమతా బెనర్జీ క్యాబినెట్లో ఫిర్హద్, సుబ్రతా ముఖర్జీలు మంత్రులుగా ఉన్నారు. నారద న్యూస్ చేపట్టిన ఆ స్టింగ్ ఆపరేషన్లో వీరంతా కెమెరా ముందే ముడుపులు తీసుకుంటూ పట్టుబడ్డారు.
నన్నూ అరెస్టు చేయండి..
అక్రమ రీతిలో మంత్రులను అరెస్టు చేశారని, తనను కూడా సీబీఐ అరెస్టు చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. సీబీఐ ఆఫీసులో అన్నట్లు తృణమూల్ లాయర్ అణిద్య రౌత్ తెలిపారు. సుమారు 45 నిమిషాల పాటు సీబీఐ ఆఫీసులో ఆమె గడిపారు.