సిరీస్ ఆశలు సజీవంగాఉండాలంటే గెలువడమే ఇక కోహ్లీసేనకు ఏకైక మార్గం. నేడు జరిగే నాలుగో టీ20లో ఇంగ్లండ్కు కళ్లెం వేస్తేనే భారత్ పోటీలో ఉంటుంది. సిరీస్లో టాస్ కీలకం అవుతుండగా.. ఇంగ్లండ్ పేసర్లకు టీమ్ఇండియా ధాటిగా సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ను నిలుపుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉండగా.. జోరు కొనసాగించాలని ఇంగ్లండ్
తహతహలాడుతున్నది.
అహ్మదాబాద్: పొట్టి సిరీస్ ఉత్కంఠ దశకు చేరింది. గురువారం ఇక్కడ జరుగనున్న నాలుగో టీ20లో ఇంగ్లండ్ను మట్టికరిపిస్తేనే టీమ్ఇండియా సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. మూడో టీ20లో ఓడి ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-2తో వెనుకబడ్డ కోహ్లీసేన మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. 2-2తో సమం చేసి సిరీస్ ఫలితాన్ని చివరి మ్యాచ్కు తీసుకెళ్లాలని కసితో ఉంది. పవర్ప్లేలో ఇంగ్లండ్ పేసర్లు మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ ఎక్స్ప్రెస్ బంతులకు చతికిలపడుతున్న భారత బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో దీటైన జవాబివ్వాల్సిన అవసరం ఉంది. సిరీస్లో తొలుత బ్యాటింగ్ చేసిన తొలి, మూడో మ్యాచ్ల్లో మొదటి ఆరు ఓవర్లలో సరైన స్కోర్లు రాకపోవడం ఓటములకు ప్రధాన కారణమైంది.
రాహుల్ను కొనసాగిస్తారా..
సిరీస్లో వరుసగా 1,0,0 స్కోర్లతో తీవ్రంగా విఫలమైన భారత్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ను తుదిజట్టులో కొనసాగిస్తారా అన్న అంశం ఆసక్తికరంగా మారిం ది. కెప్టెన్ కోహ్లీతో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సైతం రోహిత్ శర్మతో కలిసి రాహులే ఓపెనింగ్కు దిగుతాడన్న సంకేతాలు ఇచ్చారు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస అర్ధశతకాలతో మంచి ఫామ్లోకి వచ్చాడు. అయితే ఆర్చర్, వుడ్తో కూడిన ఇంగ్లిష్ పేస్ దళాన్ని సరిగా ఎదుర్కోలేకపోవడంతో పవర్ప్లేలో భారత్ తేలిపోతున్నది. పంత్, పాండ్యా నుంచి ధనాధన్ ఇన్ని ంగ్స్ బాకీ ఉంది. బౌలింగ్లో చాహల్ ధారాళంగా పరుగులిచ్చేస్తుండగా.. సుందర్ నాలుగు వికెట్లతో పాటు పొదుపైన బౌలింగ్తో ఫామ్లో ఉన్నాడు.
టాస్.. పేస్ కీలకం
ఈ సిరీస్లో ఇప్పటి వరకు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జట్లే గెలిచాయి. రెండో టీ20లో లక్ష్యఛేదనలో అదరగొట్టిన టీమ్ఇండియా సైతం తదుపరి పోరులో మంచి లక్ష్యాన్ని నిర్దేశించడంలో విఫలమైంది. దీంతో టాస్ కీలకంగా మారింది. మరోవైపు ఇంగ్లండ్ పేసర్లు మార్క్ వుడ్, ఆర్చర్ బౌన్స్తో ఎక్స్ప్రెస్ బంతులు వేస్తూ భారత బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇదే క్రమంలో భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్, శార్దూల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. పవర్ప్లేలో ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ను కట్టడి చేయలేకున్నారు. మూడో మ్యాచ్లో చాహల్తో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. మరోవైపు ఇంగ్లండ్ స్టార్లు బట్లర్, బెయిర్స్టో సైతం ఫామ్లోకి రావడంతో నాలుగో టీ20లో టీమ్ఇండియా పేసర్లు సత్తాచాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.