న్యూఢిల్లీ: పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోమారు చాటుకున్నది. సార్క్ సమావేశానికి ఆఫ్ఘనిస్థాన్ తరఫున తాలిబన్ల ప్రతినిథిని అనుమతించాలని పట్టుబట్టింది. దీనికి సభ్యదేశాలు ఒప్పుకోకపోవడంతో సార్క్ వార్షిక సమావేశం రద్దయింది. ఈ మేరకు నిర్వాహక దేశం నేపాల్ ప్రకటించింది. సార్క్ విదేశాగ మంత్రుల సమావేశం ఈ నెల 25 నుంచి వర్చువల్గా జరగాల్సి ఉంది.
ఆఫ్ఘనిస్థాన్ తరుపున తాలిబన్ ప్రతినిధిని అనుమతించాలని పాక్ ప్రభుత్వం పట్టుబట్టింది. అయితే ఇందుకు సభ్యదేశాలు అంగీకరించలేదు. దీంతో తాలిబన్లను అనుమతించకపోతే.. గత అష్రఫ్ ఘనీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులనును అనుమతించవద్దని పాక్ పట్టుబడింది. దీంతో పాక్ తీరుపై సభ్య దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సార్క్ వార్షిక సమావేశం వాయిదా పడింది.
ఈ దక్షిణాసియా కూటమిలో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక సభ్యదేశాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ప్రాతినిథ్యం లేకుండా సమావేశం నిర్వహించాలని మెజారిటీ సభ్యదేశాలు నిర్ణయించాయి. అయితే దీనికి పాకిస్థాన్ ఒప్పుకోలేదని అధికారులు వెల్లడించారు.
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో సార్క్ విదేశాంగ మంత్రుల భేటీ ఆనవాయితీగా వస్తున్నది. అయితే సార్క్ సభ్య దేశాల మధ్య సమ్మతి కొరవడటంతో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు నేపాల్ ప్రకటించింది. ఈ మేరకు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.