అమీర్పేట్, ఏప్రిల్ 2: దీర్ఘకాలంగా క్రైస్తవులు ఎదుర్కొంటున్న శ్మశానవాటిక అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. స్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని సనత్నగర్ బాప్టిస్ట్ చర్చి గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా జరిగిన ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల శ్మశాన వాటిక అంశాన్ని సీఎం కేసీఆర్ పూర్తి సానుకూల దృక్పథంతో పరిశీలిస్తున్నారని, ఇటీవల సికింద్రాబాద్లో జరిగిన క్రైస్తవ ప్రముఖుల సమావేశంలో కూడా ఇదే సమస్య ప్రస్తావనకు వచ్చిందని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని మతాలకు చెందిన విశ్వాసాలను సముచితంగా గౌరవిస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వేడుకలను నిర్వహిస్తున్న చర్చి ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటలను చర్చి ప్రతినిధులు జోసెఫ్ తదితరులు ఘనంగా సన్మానించారు.
ఆశ్రయం, హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన మొబైల్ మెడికల్ వ్యాన్ను మంత్రి ఈటల ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఈ వ్యాన్ ద్వారా ఉచిత ల్యాబ్ సేవలు, ఎక్స్రే, సీబీపీ, ఈసీజీ, సెరమ్, ఆర్బీహెచ్ పరీక్షలు ఉచితంగా జరుపుతామని వ్యాన్ నిర్వాహకులు జవహర్ కెనెడీ మంత్రికి వివరించారు. ఆశ్రయం, హ్యాండ్ ఆఫ్ హోప్ ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్న ఉచిత వైద్య సేవలు అపూర్వమైనవంటూ అభినందించారు.