న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో విదేశీ కొవిడ్-19 టీకాలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా వాటిపై దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ టీకా ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల ఆరంభంలో భారత్కు చేరనున్నది. ఇదే సమయంలో మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు కూడా తమ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. విదేశీ టీకాలపై ప్రస్తుతం 10 శాతం దిగుమతి సుంకం, 16.5 శాతం ఐజీఎస్టీతోపాటు అదనంగా సోషల్ వెల్ఫేర్ సర్చార్జీ విధిస్తున్నారు. దీంతో దేశంలో పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల కంటే విదేశీ కొవిడ్ టీకాలు ఖరీదయ్యే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో విదేశీ కొవిడ్ టీకాలపై 10 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయడం ద్వారా వాటి ధరలను తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.