న్యూఢిల్లీ : ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ల నూతన సర్కార్ ఏర్పాటు వేడుకలకు హాజరుకాబోమని రష్యా స్పష్టం చేసింది. రాయబారస్థాయి అధికారులు ఆప్ఘన్లో తాలిబన్ ప్రభుత్వ ప్రారంభ వేడుకలకు హాజరవుతారని గత వారం రష్యా ఎగువ సభ స్పీకర్ పేర్కొన్న నేపథ్యంలో మాస్కో తాజా ప్రకటన వెలువడటం గమనార్హం.
ఆప్ఘనిస్థాన్లో తమ సారధ్యంలోని ప్రభుత్వ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరు కావాలని తాలిబన్లు పాకిస్తాన్, చైనా, రష్యా సహా పలు దేశాలను ఆహ్వానించినట్టు సమాచారం. తాలిబన్ల వశమైన ఆప్ఘన్లో ఈ మూడు దేశాలు ఇప్పటికీ తమ రాయబార కార్యాలయాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాలిబన్ల సర్కార్ను గుర్తించడంపై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని భారత్లో రష్యా రాయబారి నికోలే కుదషెవ్ ఇటీవల పేర్కొన్నారు.