లాస్ఏంజెలెస్, మే 29: ‘కరోనా టీకా వేసుకుంటే రూ.10 కోట్ల నగదును బహుమతిగా ఇస్తాం’ – దేశంలో వ్యాక్సిన్ డోసు దొరకడమే గగనమైపోతున్న ఈ సమయంలో ఇలాంటి అవాస్తవ ప్రకటనలేమిటి అని కోపగించుకోకండి. ఈ ప్రకటన మన దేశంలో కాదు. అమెరికాలోని కాలిఫోర్నియాలో. కరోనా కేసులు తగ్గడంతో వచ్చేనెల 15న అక్కడ ఆంక్షలు ఎత్తేస్తున్నారు. అయితే, రాష్ట్ర జనాభాలో 63 శాతం మంది మాత్రమే టీకాలు వేయించుకున్నారు. మిగిలిన వారికి వీలైనంత త్వరగా తొలి డోసు అందించాలని తీవ్రంగా ఆలోచించిన రాష్ట్ర గవర్నర్, డెమోక్రటిక్ పార్టీ నేత గవిన్ న్యూసమ్కు ఓ ‘భారీ’ ఐడియా తట్టింది. జూన్ 15 లోపు వ్యాక్సిన్ వేసుకున్న వారికి లక్కీ డ్రా తీసి బంపర్ బహుమతులు ఇస్తామని ప్రకటించారు.