బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపై రాకెట్ దాడి జరిగింది. పటిష్ట భద్రత నడుమ గ్రీన్జోన్లో ఉన్న ఎంబసీపైకి గురువారం ఉదయం ఓ రాకెట్ దూసుకొచ్చింది. అయితే దానిని గుర్తించిన యాంటీ రాకెట్ సిస్టం.. ఆ రాకెట్ను దారి మళ్లించింది. కాగా, కొద్దిసేపట్లోనే మరో రాకెట్ ఎంబసీకి సమీపంలో పడిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ దాడులవల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని భద్రతాధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు, ఇతర దేశాలకు సంబంధించిన ఎంబసీలు కూడా ఉన్నాయి.
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో రెండు రోజుల క్రితం అమెరికా ఎంబసీపై ఎగిరిన డ్రోన్ను ఆ దేశ భద్రతా దళాలు కూల్చివేశాయి. గత సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎగిరిన ఈ డ్రోన్ లో శక్తిమంతమైన పేలుడు పదార్థాలు ఉన్నట్టు తెలిసింది. అమెరికా సైనికులు రాకెట్లను ప్రయోగించి దీన్ని కూల్చివేశారని ఎంబసీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి బాగ్దాద్ లోని అమెరికన్ స్థావరాలపై 47 డ్రోన్ దాడులు జరిగాయని ఏఎఫ్ పీ వార్తా సంస్థ తెలిపింది.