రుద్ర (పేరుమార్చాం) గతేడాది యాపిల్ సంస్థకు చెందిన మ్యాక్బుక్ ఎయిర్ (రెటీనా మోడల్)ను కొనుగోలు చేశాడు. అయితే ఇటీవల ఆ ల్యాప్టాప్లో సాంకేతిక సమస్య తలెత్తింది. యాపిల్ సర్వీసింగ్ సెంటర్కి వెళ్తే, ఆ మోడల్ను గత నవంబర్ 17 నుంచి నిలిపివేశామని, స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులోలేవని అక్కడి సిబ్బంది సమాధానమిచ్చారు. ఇతర సర్వీసింగ్ సెంటర్లకు వెళ్తే ల్యాప్టాప్లో చిన్న సమస్య ఉన్నదని, అయితే రిపేర్ (మరమ్మత్తు) చేయాలంటే స్పేర్ పార్ట్స్ అవసరమన్నారు. రూ. 90 వేలు వెచ్చించి కొనుగోలు చేసిన సిస్టమ్ నిరుపయోగంగా మారడంతో ఏమిచేయాలో రుద్ర కు పాలుపోవడంలేదు.
ఇది ఒక్క రుద్ర సమస్యే కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది దాదాపు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. అందుకే దీనికి పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ అమెరికా, ఐరోపా, పశ్చిమాసియా తదితర దేశాల్లోని ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు ‘మరమ్మత్తు హక్కు (రైట్ టూ రిపేర్)’ చట్టాల కోసం పెద్ద ఉద్యమాన్నే లేవనెత్తారు.
ఏమిటీ ‘రైట్ టూ రిపేర్’ ఉద్యమం
విపణిలోకి కంపెనీలు తీసుకొచ్చే మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీ, వాషింగ్ మెషిన్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ వాచ్ల వంటి గ్యాడ్జెట్లలో తలెత్తే చిన్న సమస్యలను వినియోగదారుడు స్వతహాగా రిపేర్ చేసుకోవడానికి అవసరమైన సమాచారం, యూజర్ మ్యాన్యువల్, స్పేర్ పార్ట్స్ను తయారీ సంస్థలు అందుబాటులోకి తీసుకురావడమే ‘రైట్ టూ రిపేర్’ ఉద్యమం ముఖ్యోద్దేశం.
ఎందుకు ఈ ఉద్యమం?
తమ అమ్మకాలను పెంచుకోవడానికి ఒకే రకమైన గ్యాడ్జెట్లో కొన్ని మార్పులు చేస్తూ కొత్త మోడల్స్, వెర్షన్ల పేరుతో వాటిని కంపెనీలు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అలాగే, పాత మోడల్ గ్యాడ్జెట్కు సంబంధించిన స్పేర్ పార్ట్స్ను సర్వీసింగ్ సెంటర్లలో, బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉంచడంలేదు. దీంతో కొనుగోలు చేసిన గ్యాడ్జెట్లో ఏదైనా చిన్న సమస్య తలెత్తినా వాటికి మరమ్మత్తు చేసి పునర్వినియోగించుకునే అవకాశం కస్టమర్లకు కలుగడంలేదు. విధిలేక తప్పనిసరి పరిస్థితుల్లో కస్టమర్లు కొత్త గ్యాడ్జెట్లను కొనుగోలు చేయాల్సి వస్తున్నది. దీంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. నిరుపయోగంగా మారిన గ్యాడ్జెట్లు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడంతో పర్యావరణ కాలుష్యం జరుగుతున్నది. దీనికి చెక్ పెట్టేందుకే ‘రైట్ టూ రిపేర్’ ఉద్యమం ప్రారంభమైంది.
అక్కడ అమల్లోకి
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ఇప్పటికే ‘రైట్ టూ రిపేర్’ బిల్లు చట్టంగా మారింది. మిగతా రాష్ర్టాల్లో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ నిబంధనలను త్వరగా చట్టంగా మార్చాల్సిన అవసరమున్నదని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. దీనికి సంబంధించి యూజర్ రిపేరింగ్ మ్యాన్యువల్స్పై కంపెనీలు విధించిన ఆంక్షలను ఎత్తేయాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్కు శుక్రవారం కార్యనిర్వహక ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, టీవీ, వాషింగ్ మెషిన్లు విక్రయించే సంస్థలు ‘రైట్ టూ రిపేర్’ నిబంధనలు పాటించాలని బ్రిటన్ ఆదేశించింది.
కంపెనీలు ఏమంటున్నాయి?
‘రైట్ టూ రిపేర్’ ఉద్యమాన్ని యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా వంటి దిగ్గజ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ‘రిపేరింగ్’ పేరిట తమ ప్రొడక్ట్ సమాచారాన్ని వినియోగదారులకు ఇస్తే, తమ మోడల్స్, వెర్షన్ల ప్రత్యేకతలు, ఫార్ములాలు ఇతరులకు తెలిసే ప్రమాదమున్నదని, దీంతో తమ సాంకేతికతను పోటీసంస్థలు దొంగిలించే ప్రమాదమున్నదని వాదిస్తున్నాయి.