కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లకు రెబల్ ఫోర్స్ షాక్ ఇచ్చాయి. వారి ఆధీనంలో ఉన్న మూడు జిల్లాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఖైర్ ముహమ్మద్ అందరాబి నేతృత్వంలోని ప్రజా ప్రతిఘటన దళాలు బాగ్లాన్ ప్రావిన్స్లోని పాల్-ఇ-హేసర్, దేహ్ సలాహ్, బాను జిల్లాలను స్వాధీనం చేసుకున్నాయని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఈ పోరాటంలో సుమారు 40 మంది తాలిబన్ ఫైటర్స్ మరణించగా, మరో 15 మంది గాయపడినట్లు పేర్కొన్నాయి.
కాగా, తాలిబన్లు ప్రకటించిన మేరకు సాధారణ క్షమాభిక్ష స్ఫూర్తితో వారు పని చేయలేదని ప్రజా ప్రతిఘటన దళాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లను ఎదుర్కొంటామని, మిగతా జిల్లాలను కూడా స్వాధీనం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాయి. కాగా, రెబల్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్న జిల్లాల్లో తిరిగి ఆఫ్ఘన్ జెండాలను పునరుద్ధరించారు. తాలిబన్ల వశం కాని పంజ్షీర్ ప్రావిన్స్కు సమీపంలో మూడు జిల్లాలను రెబల్ ఫోర్సెస్ స్వాధీనం చేసుకున్నాయి. తాలిబన్ చేతిలో మరణించిన వ్యతిరేక నాయకుడు అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్ ఈ ప్రతిఘటన దళాలకు కమాండర్గా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు తాలిబన్లపై ప్రతిఘటన సజీవంగా ఉన్నదని, ఆఫ్ఘనిస్థాన్ మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా ముహమ్మది తెలిపారు. తాలిబన్ల ఆధీనంలోని మూడు జిల్లాలను ప్రతిఘటన దళాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. తాలిబన్ ఉగ్రవాదులను ఎదుర్కోవడం తమ విధి అన్ని ట్వీట్ చేశారు.