న్యూఢిల్లీ : పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా రెండు రోజుల పాటు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత విషయాలు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నడ్డా ఢిల్లీలోని తన నివాసంలో నేతలతో చర్చించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసోంలో అధికారాన్ని నిలుపుకోగా.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. కేరళ, తమిళనాడులో నిరాశే ఎదురైంది. పశ్చిమ బెంగాల్లో అధికారంపై ఎన్నో ఆశలు పెట్టుకోగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఓటమి తప్పలేదు.
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, గోవా, గుజరాత్లో ఎన్నికలు జరుగనున్నాయి. పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా ఈ అసెంబ్లీ ఎన్నికలను భావిస్తున్నారు. వచ్చే ఏడాది గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్ను మినహాయించి మిగతా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. సమావేశంలో పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై చర్చించవచ్చని తెలుస్తోంది. సమావేశానికి భూపేందర్ యాదవ్, సీటీ రవి, దుష్యంత్ గౌతమ్, డీ పురందేశ్వరి, అరుణ్ సింగ్, దిలీప్ సైకియా, కైలాష్ విజయవర్ఘియా, తరుణ్ చుగ్, బీఎల్ సంతోష్, శివప్రకాష్ హాజరుకున్నారు.