బూర్గంపహాడ్లో అత్యధికంగా
99.6 మిల్లీ మీటర్ల వర్షపాతం
ఖమ్మం జిల్లాలో 16.3 మీ.మీ,
భద్రాద్రిలో 44.6 మి.మీ సగటు
కొత్తగూడెం/ఖమ్మం వ్యవసాయం, జూలై 11: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వరదనీటితో ప్రవహించాయి. డ్రైనేజీల్లోని నీరు పొంగి ఇళ్లల్లోకి చేరింది. కొత్తగూడెంలోని మొర్రేడువాగు, రామవరంలోని గోధుమవాగుల్లోకి వరదనీరు వచ్చి చేరింది. కొత్తగూడెం బస్టాండ్ నుంచి సూపర్బజార్ వెళ్లే మార్గమధ్యలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జిలోకి భారీగా వరదనీరు చేరింది. మోకాళ్లలోతు వరదనీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలు గంటసేపు నిలిచిపోయాయి. వరద ఉధృతిని చూసి ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి నీరు నిలిచిన ప్రదేశాలను పరిశీలించి జేసీబీ సాయంతో బయటికి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రంతోపాటు చుంచుపల్లి, జూలూరుపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు, మండలాల్లో వర్షం కురిసింది. లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో ఉన్న సింగరేణి ఓపెన్కాస్ట్ బొగ్గు గనుల్లో భారీగా నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
జిల్లాలో వర్షపాతం వివరాలు..
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి వర్షం కురిసింది. సగటున 44.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చర్లలో 3.4, దుమ్ముగూడెంలో 85.4, అశ్వాపురంలో 92.8, మణుగూరులో 8.2, గుండాలలో 19.4, ఇల్లెందులో 19.4, టేకులపల్లిలో 65.2, జూలూరుపాడులో 28.2, చండ్రుగొండలో 56.4, కొత్తగూడెంలో 74.2, పాల్వంచలో 49.2, బూర్గంపహాడ్లో 99.6, భద్రాచలంలో 56.6, ములకలపల్లిలో 12.2, దమ్మపేటలో 50.2, అశ్వారావుపేటలో 36.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఖమ్మం జిల్లాలో 16 మిల్లీ మీటర్లు
ఖమ్మం జల్లాలో కూడా ఆదివారం ఉదయం ఉదయం నుంచి సాయంత్రం వరకు విస్తారంగా వర్షం కురిసింది. రెండు రోజుల నుంచి ఉపరితల ఆవర్తన ప్రభావంతో దట్టమైన మేఘాలు అలుమున్నాయి. తేలికపాటి జల్లులు కూడా కురిశాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు విస్తారంగా వర్షం కురిసింది. నగరంలో కురిసిన వర్షానికి గాను నగరవాసులు, ద్విచక్రవాహనదారులు స్వల్ప ఇబ్బందులకు గురయ్యారు. మండలాల్లో కురిసిన వర్షంతో దమ్ము చేసిన పొలాల్లో వరినాట్లు వేసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఖమ్మం నగరంతోపాటు రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, కామేపల్లి, వైరా, కొణిజర్ల, ఏన్కూరు, కారేపల్లి. చింతకాని, కూసుమంచి తదితర మండలాల్లో విస్తారంగా వర్షం కురిసింది. మిగిలిన మండలాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సగటున 16.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బోనకల్లు మండలంలో 44.2 మి.మీ వర్షం కురిసింది. వైరాలో 26.8 మి.మీ, ఏన్కూరులో 32.6 మి.మీ, కొణిజర్లలో 32.4 మి.మీ, నేలకొండపల్లిలో 29.6 మి.మీ, తల్లాడలో 20.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
మరో రెండు రోజులూ వర్షమే..
ఖమ్మం జిల్లాలో ఈ సీజన్లో ఆదివారం నాటికి మొత్తం 19 రోజులపాటు వర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. వానకాలం సాగుకు సంబంధించి నేటి వరకు 1,37,234 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. మరో 51,812 ఎకరాల్లో రైతులు వరి నారుమడులు పోసుకొని నాట్లు వేసుకునేందకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. అత్యధికంగా పత్తి 1,06,720 ఎకరాల్లో సాగవుతున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ రెండు కోరికలు తీరకుండానే మరణించిన కత్తి మహేశ్
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి : వినయ్ భాస్కర్
మెదక్లో పోక్సో కోర్టు ప్రారంభం
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వాన