‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అంటారు. సేవలందించే విషయంలో ముందు వరుసలో ఉండేవి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు (ఎన్జీవోలు), స్వచ్ఛంద సంస్థలు. కరోనా మహమ్మారి సంక్షోభం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతో మందికి వివిధ రకాలుగా సహాయాన్ని ఈ సంస్థలు అందిస్తున్నాయి.
కొవిడ్ సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న దేశ ప్రజలను ఆదుకోవడానికి అనేక దేశాలు, విదేశీ కార్పొరేట్ సంస్థలు, ఏజెన్సీలతో పాటు ప్రవాస భారతీయులు ముందుకువస్తున్నారు. దాదాపు 40 దేశాలు వివిధ రూపాల్లో ఉదారంగా కొవిడ్ సాయాన్ని అందిస్తున్నాయి. వీటిలో కరోనా చికిత్సకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, రెమిడెసివిర్ ఔషధాలు, ఇతర వైద్య అత్యవసరాలు, నగదు విరాళాలు ముఖ్యమైనవి.
విదేశాల నుంచి విరాళాలు పొందడంలో కొన్ని ఇబ్బందులుండేవి. విదేశీ సహాయ నియంత్రణ (సవరణ) చట్టం 2020 (ఎఫ్సీఆర్ఏ) నిబంధనల మూలంగా ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఇబ్బందులను అధిగమించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల చర్యలు చేపట్టింది. గతేడాది సెప్టెంబర్లో ఈ చట్టానికి సెక్షన్17 ద్వారా సవరణ చేసింది. విదేశాల నుంచి నగదు విరాళాలను స్వీకరించే లైసెన్స్ కలిగిన వ్యక్తులు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు సంబంధిత లావాదేవీల కోసం తమ ప్రధాన బ్యాంకు ఖాతాను ఢిల్లీలోని పార్లమెంట్ వీధిలోని ఎస్బీఐ ప్రధాన శాఖలో తెరవాల్సిన గడువు తేదీని మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించింది. విదేశీ సహాయ నియంత్రణ చట్టం ప్రకారం అనుమతి పొందిన 22,598 వ్యక్తులు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలలో 17,611 సం స్థలు నిర్ణీత గడువు తేదీ మార్చి 31లోపు అవసరమైన ధృవపత్రాలతో న్యూ ఢిల్లీ ఎస్బీఐ ప్రధాన శాఖలో ఖాతా తెరవడం కోసం సంప్రదించగా, వీటిలో 13,729 ఖాతాలకు అనుమతి ఇచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. సరైన ధృవపత్రాలను సమర్పించినప్పటికీ హోంమంత్రిత్వ శాఖ అనుమతి జారీతో ఆలస్యం జరగడం వల్ల ఖాతా ప్రారంభించ లేకపోయిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఢిల్లీ, గౌహతి హైకోర్టులను ఆశ్రయించి గడువును 6 నెలల వరకు పొడిగించేట్లు ఆదేశించవలసిందిగా కోరాయి. దీంతో కేంద్ర హోం మంత్రి త్వ శాఖ జూన్ 30 వరకు పొడిగించింది. దీంతో దాదాపు 8,862 వ్యక్తులు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు ఎఫ్సీఆర్ఏ ఖాతాను ప్రారంభించడానికి తద్వారా విదేశీ నగదు విరాళాలను పొంది కొవిడ్ బాధితులకు ఆపన్నహస్తం అం దించడానికి మార్గం సుగమమైంది.
జూలై 1 తర్వాత ఖాతా ప్రారంభించిన వ్యక్తులు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో విదేశీ నగదు విరాళాలను స్వీకరించరాదని హోం మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వులో పేర్కొన్నది. అయితే వివిధ రాష్ర్టాలు లాక్డౌన్ అమలు చేస్తున్నందున వివిధ రాష్ర్టాల్లో ఉన్న ఎఫ్సీఆర్ఏ నమోదిత వ్యక్తులు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు న్యూ ఢిల్లీలోని ఎస్బీఐ ప్రధాన శాఖలో ప్రత్యక్షంగా ఖాతా తెరవడమనేది కొంత ఇబ్బందితో కూడుకున్న పని. ఈ క్లిష్ట సమయంలో ఆన్లైన్ ద్వారా ఖాతా తెరిచే వెసులుబాటు కల్పించడం తక్షణ అవసరం. అదేవిధంగా లైసెన్స్ గడువు పూర్తయిన సంస్థలు రెన్యూవల్ చేసుకోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతంలో పొడిగించిన మే 31 గడువు తేదీని తిరిగి సెప్టెంబర్ 30 వరకు పొడిగించడం ఊరట కలిగించే అంశం. ఈ తరుణంలో విదేశాల నుంచి వచ్చే కొవిడ్ సంబంధిత దిగుమతులు, సహాయాన్ని సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీటిలో ప్రాథమిక దిగుమతి సుంకాన్ని, ఆరోగ్య సెస్ను మినహాయించడంతో పాటు జీఎస్టీని మినహాయించడం వంటివి ఎంతో ఉపశమనం కల్పించేవి, అహ్వానించదగినవి.
డాక్టర్ ఎం.మల్లారెడ్డి
(వ్యాసకర్త: కామర్స్ సహాయ ఆచార్యులు)