నిర్మల్ అర్బన్/ఆదిలాబాద్ టౌన్, మార్చి 23 : స్వతంత్ర భారత బీమా సంస్థల్లో ఒక నమ్మకమైన, ప్రభుత్వ రంగ సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అవతరించింది. 1956లో ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఆఫ్ 1956ని కేంద్రం జారీ చేయగా, ఈ చట్టం ద్వారా అప్పటికీ మనుగడలో ఉన్న 245 బీమా కంపెనీలతో కలిపి సంస్థ ఏర్పడింది. అప్పుడు కేంద్రం ఎల్ఐసీలో 5కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఎల్ఐసీ ఏటా తన లాభాల్లో 5శాతం లాభాలను కేంద్రానికి ఇవ్వాలని, 95 శాతం లాభాలను పాలసీదారులకు వినియోగించాలని ఆదేశించింది. కాగా.. ఎల్ఐసీ శాఖోపశాఖలుగా విస్తరించింది. లక్షల బ్రాంచ్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 40 కోట్ల మందికిపైగా పాలసీదారులు ఉన్నారు. 31,14,496 కోట్ల లైఫ్ఫండ్స్, 31,96,214 కోట్ల ఆస్తులను ఎల్ఐసీ సంపాదించుకుంది. 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. విదేశీ పెట్టుబడులతో ప్రైవేట్ బీమా కంపెనీలకు అనుమతిని ఇచ్చింది. 2000 సంవత్సరంలో ప్రైవేట్ బీమా సంస్థలు పెద్ద సంఖ్యలో దేశ మార్కెట్లోకి ప్రవేశించినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అందులో చాలా కంపెనీలు మూతపడిపోయాయి.
ఆది నుంచీ కేంద్రానికి అండ..
ఇప్పటి వరకు ఎల్ఐసీ కేంద్ర ప్రభుత్వానికి 24,01,457 లక్షల కోట్ల పెట్టుబడిని అందించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 1956లో పెట్టిన 5 కోట్ల పెట్టుబడికి ఇప్పటివరకు 20వేల కోట్ల డివిడెంట్ను ఎల్ఐసీ చెల్లించింది. ప్రైవేట్ కంపెనీలు బీమా రంగంలోకి ప్రవేశించిన 2000 సంవత్సరం తర్వాత ఈ రెండు దశాబ్దాల కాలంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. అదే సమయంలో దాదాపు 10వేల కోట్ల డివిడెంట్ను కేంద్రానికి చెల్లించింది. లక్షన్నర మంది ఉద్యోగులకు నెలనెలా వేలాది రూపాయల వేతనాలు ఇస్తున్న సంస్థ, వారి ఉద్యోగుల వేతనాల ద్వారా నమ్మకమైన, క్రమానుగతమైన ఇన్కం ట్యాక్స్ను కేంద్రానికి చెల్లించేలా చూసింది. అలాగే పాలసీలపై వ్యాట్, ఇన్కమ్ ట్యాక్స్లను పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి చెల్లించింది.
ప్రైవేటీకరణ ప్రమాదం..
ఎల్ఐసీ ప్రైవేటీకరణ ప్రమాదపుటంచుల్లోకి వెళ్తున్నది. ప్రైవేట్ కంపెనీలన్నింటినీ జాతీయం చేసి, ప్రభుత్వ రంగం సంస్థగా ఒకప్పుడు మార్చిన బీమా రంగాన్ని మళ్లీ ప్రైవేట్ వ్యవస్థల్లోకి పంపించేందుకు కేంద్రం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టుబడులను సమకూర్చుకునే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో వాటాలను విక్రయించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. సంస్థలో 25 శాతం వాటాను విక్రయిస్తే 2.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఒకేసారి సంపాదించాలని యోచిస్తున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పెట్టుబడుల ఉపసంహరణతో ఎల్ఐసీలోకి ప్రైవేట్ కంపెనీలు వచ్చి చేరుతాయి. ఇవి భవిష్యత్లో కేంద్ర ప్రభుత్వానికి పెట్టుబడులను, లాభాలను అందించేందుకు అంగీకరించని పరిస్థితి నెలకొంటుంది. దీని ప్రభావం కేంద్ర ప్రభుత్వంపైనా, దేశ ప్రజలపైనా ప్రభావం చూపుతుంది. కాలక్రమంలో ఎల్ఐసీలో వాటాలను ప్రభుత్వం ఉప సంహరించుకొని, ప్రైవేట్ సంస్థల వాటాలు పెరిగితే పాలసీదారులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇప్పటి వరకు పాలసీదారులకు, ప్రభుత్వానికి లభించిన లబ్ధి భవిష్యత్లో ప్రైవేట్ కంపెనీల పరం అవుతుంది.
ఉద్యోగుల ఆందోళనబాట
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో దాదాపు 160 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా. దాదాపు 5 లక్షలకుపైగా పాలసీదారులు ఉన్నారు. కాగా, ఎల్ఐసీని ప్రైవేటీకరిస్తే తమ బతుకులు ప్రశ్నార్థకమవుతాయని ఉద్యోగులు, ఏజెంట్లు ఆందోళన బాట పట్టారు. కొన్ని రోజులుగా ర్యాలీలు, జీవిత బీమా కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నిరసన తెలిపారు. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాకేంద్రాల్లోని ఎల్ఐసీ కార్యాలయాల ఎదుట ఏజెంట్లు, ఉద్యోగులు నిరసన తెలిపారు. వారు ఈ సందర్భంగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వ్యక్తిగత బీమా సౌకర్యం కల్పించాలని, బీమాపై జీఎస్టీని ఎత్తివేయాలని, బోనస్ రేటు, గ్రాట్యూటీని పెంచాలని, ఆరోగ్య బీమా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.