పరకాల, మే 24: తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని, ఇందుకు కారణమైన నిర్వాహకులు, రైసు మిల్లుల యాజమానులపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అడిషినల్ కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీవో సంపత్ రావు, సివిల్ సైప్లె డీఎం భాస్కర్ రావు, డీసీవో సంజీవ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోళ్లపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, కొనుగోలు కేంద్రాలకు చేరుకున్న ధాన్యాన్ని వెంటనే కాంటాలు నిర్వహించి తరలించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
కొన్ని కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత ఉందని, వెంటనే వీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రతి రోజు ఎన్ని బస్తాలు కాంటాలు నిర్వహిస్తున్నారు, మిల్లులకు ఎన్ని బస్తాలు తరలిస్తున్నారనే వివరాలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో లారీల కొరత వేధిస్తున్నదని, పోలీసులు, రెవెన్యూ అధికారులు వీటిని సమకూర్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపాలన్నారు. మిల్లుల వద్ద దిగుమతి ఆలస్యమవుతున్నదని, మిల్లు యాజమాన్యాలు హమాలీలను పెంచుకునే విధంగా కృషి చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని ఆయన కోరారు. కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ సమన్వయం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, నియోజకవర్గంలోని పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ, సంగెం మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి.
లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎసీపీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన వారు బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారని, వారిని వెంటనే గుర్తించి హొంఐసొలేషన్ కేంద్రాలకు పంపించాలని సూచించారు. లాక్డౌన్ సమయంలో బయటికి వచ్చే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని కోరారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో శానిటేషన్ పనుల నిర్వహణలో అలసత్వం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు : ఆర్డీవో
దుగ్గొండి : ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్ ఆధికారులను, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మండలంలోని పోలారం, బొబ్బరోనిపల్లి గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానికులతో కలిసి పరిశీలించారు. ఆర్డీవో మాట్లాడుతూ వాహనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాహనాలను సమకూర్చడంతోపాటు ధాన్యం తూకంలో తేడాలు రాకుండా చూడాలన్నారు. రైతులను ఇబ్బందుకు గురిచేస్తే ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందితో పాటు రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ రాంమూర్తి, నాయబ్ తహసీల్దార్ అన్నమనేని సౌజన్య, ఆయా గ్రామాల సర్పంచ్లు శంకేసి శోభాకమలాకర్, రేవూరి సురేందర్రెడ్డి పాల్గొన్నారు.