‘చెత్త’శుద్ధి పట్టని జీపీ పాలకులు
మొక్కలు ఎండి కళావిహీనంగా ప్రకృతివనం..
మేఘ్యాతండాలో నిర్లక్ష్యంగా ‘పల్లె ప్రగతి’ పనులు
చిన్నగూడూరు, ఏప్రిల్ 4: చిన్నగూడూరు మండలం మేఘ్యాతండాలో పల్లె ప్రగతి పనుల్లో జీపీ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎటుచూసినా చెత్తాచెదారంతో పాటు రోడ్లపైనే పెంటకుప్పలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో పరిసరాలు అధ్వానంగా మారాయి. గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘పల్లె ప్రగతి’ని అమలుచేస్తుంటే ఇక్కడ మాత్రం ఆచరణలో వెనుకబడింది.స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల పట్టింపులేనితనంతో మేఘ్యాతండా ‘పల్లె ప్రగతి’ లక్ష్యానికి దూరంగా ఉంది. గతంలో జయ్యారం పంచాయతీ పరిధిలో ఉన్న మేఘ్యాతండా, చిన్నతేజతండా, లాక్యతండాల్లో 955 జనాభా ఉండగా.. ప్రభుత్వం మేఘ్యాతండాను ప్రత్యేక జీపీగా ఏర్పాటుచేసింది. ఈ గ్రామంలో ఓటర్ల సంఖ్య 588, 210 ఇళ్లు ఉన్నాయి. చిన్నతేజతండా, లాక్యతండాకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా పశువుల పెంటకుప్పలు దర్శనమిస్తున్నాయి. ట్రాక్టర్ ద్వారా నిత్యం పంచాయతీ సిబ్బంది చెత్త తొలగించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అంతేగాక చిన్నతేజతండా శివారులో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు ఎండిపోతూ కళావిహీనంగా మారింది. పార్కు పలుచబడి కలుపు మొక్కలతో అధ్వానంగా ఉందని తండావాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించాలని వారు కోరుతున్నారు.
ఇవి కూడా చూడండి..
6న బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
ఆసుపత్రులు కిటకిట.. ఒక బెడ్పై ఇద్దరు, ముగ్గురు కరోనా రోగులు