మిడ్జిల్/ మహబూబ్ నగర్ : జిల్లాలోని మిడ్జిల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన బాల్ రెడ్డి.. మండల పరిధిలోని వస్పుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మిడ్జిల్లో వీరి కుటుంబానికి ఓ పెట్రోల్ బంకు కూడా ఉంది. బాల్ రెడ్డి కుటుంబం జడ్చర్ల పట్టణంలో నివాసముంటున్నది. బాల్ రెడ్డి శనివారం రాత్రి మిడ్జిల్లోని తమ సొంత ఇంటిలో ఉండగా.. పెట్రోల్ బంక్లో పని చేసే కార్మికులు ఆయనకు ఫోన్ చేశారు.
ఎంతకు ఫోన్ తీయక పోవడంతో నేరుగా ఇంటికి వచ్చి కిటికీలోంచి చూడగా బాల్ రెడ్డి విగతజీవిగా కనిపించాడు. కార్మికులు వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. శనివారం పెట్రోల్ బంకులో వచ్చిన కలెక్షన్ రూ.1.5 లక్షలు తీసుకొని బాల్రెడ్డి వచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
డబ్బులు తీసుకు వచ్చిన విషయం తెలిసిన వాళ్లే ఆయనను అనుసరించి ఉంటారని, గొంతును బిగించి చంపినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ విజయప్రసాద్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.