పారిస్: బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఫ్రాన్స్ ప్రభుత్వం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. బ్రిటన్లో భారత్ రకం కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. గతవారం ఆస్ట్రేలియా కూడా ఇదేవిధంగా ప్రకటించింది. యూకే, జర్మనీ నుంచి వచ్చే పర్యాటకులకు ఆస్ట్రేలియా రెండు వారాల క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ గత శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.
బ్రిటన్ నుంచి ఫ్రాన్స్కు వచ్చేవారు 48 గంటలలోపు కరోనా టెస్టు చేయించుకోవాలని, అందులో నెగెటివ్ ఉంటేనే దేశంలోకి అనుమతిస్తామని ఫ్రాన్స్ యూరోపియన్ వ్యవహారాల శాఖ జూనియర్ మినిస్టర్ క్లెమెంట్ తెలిపారు. యూకే నుంచి వచ్చినవారు తప్పనిసరిగా వారం రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేశారు.
బ్రిటన్లో రోజువారీ కరోనా కేసులు తగ్గినప్పటికీ, కొత్తగా నమోదవుతున్న వాటిలో భారత్ వేరియంట్ బీ.1.617 రకం కేసులు అత్యధికంగా ఉంటున్నాయి. దేశంలో గత గురువారం 3424 కేసులు నమోదవగా అందులో 2111 కేసులు భారత్ వేరియంట్వే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చే విమానాలు, పర్యాటకులపై ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా ఆంక్షలు విధిస్తున్నాయి.