సిరికొండ, ఏప్రిల్ 21: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని సిరికొండ సర్పం చ్ ఎన్నం రాజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇంటి నుంచి బయటికి వస్తే తప్పకుండా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
వారాంతపు సంతలు బంద్..
జక్రాన్పల్లి, ఏప్రిల్ 21: జక్రాన్పల్లితో పాటు పడకల్, కేశ్పల్లి, కొలిప్యాక్ గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. జక్రాన్పల్లి, కలిగోట్, పడకల్ గ్రామాల్లోని వారాంతపు సంతను మూడు వారాల పాటు రద్దు చేస్తున్నట్లు ఆయా గ్రామాభివృద్ధి కమిటీలు తీర్మానించాయి.
రెండు గ్రామాల్లో లాక్డౌన్
ధర్పల్లి, ఏప్రిల్ 21: మండల కేంద్రం ధర్పల్లితో పాటు మైలారం గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. ధర్పల్లిలో అన్ని వ్యాపార సముదాయాలను ఉదయం పది గంటల వరకే తెరిచి ఉంచుతున్నారు. మైలారం గ్రామంలో సర్పంచ్ రమేశ్ ఆధ్వర్యంలో లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. గ్రామస్తులు అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటికి రావాలని సూచిస్తున్నారు.
కరోనా కట్టడికి కొనసాగుతున్న చర్యలు..
కోటగిరి, ఏప్రిల్ 21: కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కోటగిరి మండలంలోని పంచాయతీలు అప్రమత్తం అయ్యాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మండలంలోని హంగర్గాఫారం, ఎత్తొండ, లింగాపూర్, సోంపూర్, కొల్లూర్, సుంకిని, కారేగాం, హంగర్గా, పొతంగల్ తదితర గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. మరోవైపు లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.
నేటి నుంచి చందూర్లో స్వచ్ఛంద లాక్డౌన్ ..
చందూర్, ఏప్రిల్ 21: మండల కేంద్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గురువారం నుంచి 14 రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ విధిస్తున్నట్లు సర్పంచ్ కర్లం సాయారెడ్డి బుధవారం తెలిపారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తీర్మానించినట్లు పేర్కొన్నారు. దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలన్నారు. గ్రామ పంచాయతీ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలు లాక్డౌన్ను పాటిస్తూ కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు.
కరోనాపై అవగాహన ..
రుద్రూర్, ఏప్రిల్ 21: మండలంలోని అంబం గ్రామంలో సర్పంచ్ కోర్వ భాగ్య భూషణ్ వైద్య సిబ్బంది, పోలీసులతో కలిసి కరోనాపై బుధవారం అవగాహన కల్పించారు. కరోనా బారిన పడిన వారి ఇండ్ల వద్దకు వెళ్లి బయటికి రావొద్దని సూచించారు. గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. ఉదయం 11 గంటల వరకే దుకాణాలను తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. ఎంపీటీసీ మంత్రి లక్ష్మి, ఉపసర్పంచ్ ఘన్శ్యామ్, వీడీసీ చైర్మన్ మహేశ్, గంగారాం, పాపయ్య, నర్సయ్య, పోలీసులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మోర్తాడ్ మండలంలో..
మోర్తాడ్, ఏప్రిల్ 21: మండలంలోని తిమ్మాపూర్, ధర్మోరా గ్రామాల్లో బుధవారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని సర్పంచులు గడ్డం చిన్నారెడ్డి, మండల రాజేశ్వర్ ఆధ్వర్యంలో పిచికారీ చేయించారు. గ్రామస్తులకు కరోనాపై అవగాహన కల్పించారు.