తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ఉగ్రవాదం, అంతర్గత అశాంతి నెలకొన్న దేశంలో ప్రశాంతతను, అభివృద్ధిని ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదేనని పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, పీవీ తనయుడు పీవీ ప్రభాకర్రావు అన్నారు. యూరప్లోని లాత్వియాలో నిర్వహించిన పీవీ శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. గుండెకు శస్త్రచికిత్స అనంతరం దేశం కోసమే తనకు పునర్జన్మ లభించినట్టుగా పీవీ భావించారని గుర్తుచేశారు.
రాజకీయాల నుంచి విరమణ పొందాలని భావించినప్పటికీ అనంతర కాలంలో అనూహ్య పరిణామాల మధ్య ప్రధాని పదవి చేపట్టాల్సి వచ్చిందని పీవీ ప్రభాకార్రావు అన్నారు. పీపీ సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి సంక్షోభాన్ని అధిగమించారని చెప్పారు. అందరినీ కలుపుకుని వెళ్లడం పీవీ ప్రత్యేకత అని, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూనే మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు విజయవంతంగా నడిపిన ఘనత పీవీ సొంతమని పేర్కొన్నారు.
ఏకాభిప్రాయ సాధన ద్వారా సరికొత్త రాజకీయాలకు పీవీ నాంది పలికారన్నారు. ఐటీ, టెలికామ్, రహదారులు, భారీ ప్రాజెక్టులు సహా వివిధ రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించారని పీవీ ప్రభాకర్రావు తెలిపారు. లైసెన్స్రాజ్ వ్యవస్థకు బదులుగా సులభతరమైన వాణిజ్య విధానాలు అమలు చేశారని వివరించారు. మారుమూల గ్రామం నుంచి తన మేథాశక్తితో పీవీ అంచెలంచెలుగా ఎదిగారన్నారు.
పీవీ ఘనతను నేటి తరానికి తెలియజేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. అద్భుతమైన మేథాశక్తి, స్పందించే హృదయం కలిగి ఉండటం వంటి అరుదైన లక్షణం పీవీ ప్రత్యేకత అన్నారు.
పీవీపై కేసీఆర్కు అమితమైన ప్రేమ: మహేశ్ బిగాల
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీపై సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ అని శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు, తెలంగాణ ఎన్ఆర్ఐ కన్వీనర్ మహేశ్ బిగాల అన్నారు. పీవీ ఖ్యాతిని స్మరించుకోవడం, నేటి తరానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏడాదిపాటు వివిధ దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పీవీ ఘనతపై చర్చించుకున్నామన్నారు.
పీవీ కేవలం ఆర్థిక సంస్కరణలకు మాత్రమే పరిమితం కాలేదని, ఏ రంగంలో బాధ్యత చేపట్టినా వినూత్న నిర్ణయాలు తీసుకునే నిరంతర సంస్కరణశీలి పీవీ అని కొనియాడారు. కార్యక్రమంలో నిథుం డైరెక్టర్ డాక్టర్ చిన్నం రెడ్డి పాల్గొన్నారు. పీవీ చేపట్టిన సంస్కరణల ఫలితాలనే నేటి తరం అనుభవిస్తోందని చెప్పారు. కేసీఆర్ ప్రత్యేక చొరవతో పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు.
జూమ్ ద్వారా జరిగిన మీటింగ్లో తెలుగు ప్రతినిధులు విజ్ఞాన్, క్రాంతి కుమార్, భాను, అపూర్వ, సుస్మిత, రణధీర్, స్వాతి, వినయ్ బొంతల పాల్గొన్నారు. పీవీ స్ఫూర్తిని నేటి తరానికి తెలియచేసేందుకు తమవంతు కృషి చేస్తామని చెప్పారు.