న్యూయార్క్, జూన్ 12: అమెరికాలో ఓ పోలీసు దుశ్చర్యను వెలుగులోకి తీసుకువచ్చిన భారతీయ-అమెరికన్ నీల్బేడీ లోకల్ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ అవార్డు గెలుచుకొన్నారు. ఆయన టంపాబే టైమ్స్ అనే వార్తాసంస్థలో పనిచేస్తున్నారు. అమెరికాలోని పాస్కో అనే ప్రాంతంలో ఉన్న స్థానిక పోలీసు అధికారి.. ఒక కంప్యూటర్ మోడల్ సాయంతో ‘భవిష్యత్తులో నేరాలు చేసే అవకాశం ఉన్న వారిని’ గుర్తించి, వారిని అదుపులోకి తీసుకునేవారు. అనుమానిత వ్యక్తుల జాబితాలో చిన్నపిల్లలు కూడా ఉండేవాళ్లు. ఈ అన్యాయాన్ని నీల్బేడీ తన సహచర జర్నలిస్టు కేథలీన్ మెక్ గ్రోరీ సాయంతో వరుస కథనాలు వెలువరించి ప్రపంచానికి తెలియజేశారు. నీల్తోపాటు కేథలీన్ కూడా పులిట్జర్కు ఎంపికయ్యారు.
21 రంగాల్లో ఎంపిక
పులిట్జర్ ప్రైజ్ను మీడియాతోపాటు మొత్తం 21 రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ఏటా ఇస్తారు. 20 రంగాల విజేతలకు దీనికింద 15 వేల డాలర్లు, ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ప్రజాసేవ విభాగంలో పురస్కారం లభించిన వ్యక్తికి మాత్రం బంగారుపతకం ఇస్తారు.
‘ఫ్లాయిడ్ హత్య’ను రికార్డు చేసిన టీనేజర్కు ప్రశంస
అమెరికావ్యాప్తంగా జాతివివక్ష వ్యతిరేక ఉద్యమాన్ని మరోమారు పురిగొల్పిన జార్జ్ఫ్లాయిడ్ హత్య ఉదంతాన్ని తన సెల్ఫోన్ కెమెరాతో రికార్డు చేసిన టీనేజర్ డార్నెల్లా ఫ్రేజియర్ను పులిట్జర్ బోర్డు ప్రత్యేకంగా ప్రశంసించింది. గత ఏడాది మే 25న నల్లజాతీయుడు జార్జ్ఫ్లాయిడ్ను మినియాపొలిస్లో ఓ శ్వేతజాత్యంహకార పోలీసు అధికారి బహిరంగంగా, మెడ మీద తన మోకాలు మోపి హత్య చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్రేజియర్ ఈ దారుణాన్ని సెల్ కెమెరాతో రికార్డు చేసింది. కేసు విచారణలో ఆ వీడియో కీలక ఆధారంగా నిలిచింది.