లండన్: కరోనా టీకా వేయించుకోని సొంత కుమార్తెను పబ్ యజమానురాలు లోనికి అనుమతించలేదు. కరోనా నిబంధనల అమలులో నిదర్శనంగా నిలిచిన ఈ పబ్ యజమానిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. బ్రిటన్లో కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల చాలా కాలంగా పలు వ్యాపారాలు మూతపడ్డాయి. కాగా ఆంక్షల సడలింపు నేపథ్యంలో ప్రస్తుతం అన్ని తెరుచుకున్నాయి. అయితే కరోనా టీకాలు పూర్తిగా తీసుకున్న వారినే ప్రవేశానికి అనుమతిస్తామని ఓ పబ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు అయినా వేయించుకోని కుమార్తె పబ్ వద్దకు రాగా లోనికి ప్రవేశానికి ఆమె తల్లి, యజమానురాలైన షెల్లీ జోన్స్ నిరాకరించింది. ‘సారీ.. నిన్ను లోపలికి అనుమతించలేను’ అని ముఖంమీదే చెప్పేసింది.
తమ పబ్కు వయసుపైబడిన వారు కూడా వస్తుంటారని, టీకా వేయించుకోని వారి వల్ల అలాంటి వారు అనారోగ్యానికి గురి కావడం తమకు ఇష్టం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోన్స్ తెలిపారు. మహమ్మారి కాలంలో వృద్ధులు, రోగాల బారినపడే అవకాశమున్న కస్టమర్లను రక్షించడానికి తమ పబ్ ప్రయత్నిస్తోందని చెప్పారు. కాగా, జోన్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది అభినందించారు. అయితే టీకా తీసుకోని తనని పబ్లోనికి అనుమతించకపోగా తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఒకరు ఆరోపించారు.
అయితే, తమ రెగ్యులర్ కస్టమర్లు కొందరు టీకా తీసుకోని యువకుల నుంచి రక్షణ కల్పిస్తేనే పబ్కు వస్తామని చెప్పారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోన్స్ భర్త వివరించారు. తమ ఈ విధానం వివక్షకు సంబంధించినది కాదన్నారు. ఒకవేళ ఎవరైనా అలా భావిస్తే వెంటనే దానిని మారుస్తామని చెప్పారు.