న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రతిష్టాత్మక ‘రోడ్ అండ్ బెల్ట్ ప్రాజెక్టు’లో భాగంగా చైనా చేపడుతున్న ‘చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్’ (సీపీఈసీ) పనులపై పాక్లో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. నిరసనలు, ఆత్మాహుతి దాడులకు ఇది దారితీస్తున్నది. ఈ నేపథ్యంలో పలు ఘటనలు మిత్ర దేశాలైన చైనా, పాక్ మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తున్నాయి. బలూచిస్థాన్లోని గ్వాదర్ ప్రావిన్స్లో శుక్రవారం ఒక సూసైడ్ బాంబర్ చైనీయుల కాన్వాయ్పై దాడి చేశాడు. స్థానికులైన ఇద్దరు పిల్లలు మరణించగా, ఒక చైనీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. నెల రోజుల్లో ఇది రెండో దాడి కావడం గమనార్హం. ఈ దాడి తమ పనేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తీర ప్రాంత పట్టణమైన గ్వాదర్ చైనాకు కీలకమైన ప్రాంతం. అక్కడ చైనా పెట్టుబడులు పెట్టడంతో ఆ దేశానికి చెందిన నిపుణులు, కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడినవారిని శిక్షించాలని పాక్ను చైనా డిమాండ్ చేస్తున్నది.
నిరసనలు ఎందుకు?
గ్వాదర్ ప్రావిన్స్లో చైనా చేపట్టిన ప్రాజెక్టులపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. రోడ్లపై టైర్లను తగులబెట్టారు. చైనా పనుల వల్ల నీరు, విద్యుత్తుకు కొరత, తమ జీవనోపాధికి ముప్పు ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్వాదర్ పట్టణం సీపీఈసీ ముగిసే ప్రాంతం. 60 బిలియన్ డాలర్లతో చైనా చేపట్టిన సీపీఈసీలో గ్వాదర్ ఓడరేవు అభివృద్ధి కూడా ఒక భాగం.
చైనీయులకు ముప్పు
సీపీఈసీలో పలు ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు చైనా నిపుణులు, కార్మికులు పెద్దసంఖ్యలో గ్వాదర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. గత కొద్ది నెలలుగా బలూచిస్థాన్తో పాటు కరాచీలో కూడా చైనీయులపై దాడులు పెరిగాయి. శుక్రవారం మరో దాడి జరుగడంతో పాక్లో భద్రత కొరవడిందంటూ చైనా మండిపడింది. అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు వెళ్లొద్దని పాక్లో ఉన్న తన పౌరులను హెచ్చరించింది. గత నెలలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో జరిగిన దాడిలో చైనీయుడితో పాటు 13 మంది బలయ్యారు.
చైనా రుణ ఉచ్చులో పాక్
ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు భారీగా రుణాలిచ్చి ఆయా దేశాలను చైనా తన ‘దారి’లోకి తెచ్చుకుంటున్నది. ఇందులో పాక్ కూడా ఒక్కటి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కంటే పాక్కు చైనా మూడు రెట్లు అధికంగా రుణమివ్వడం విశేషం. శ్రీలంక, కిర్గిజ్, తజకిస్థాన్, ఉక్రెయిన్, బెలారస్, ఇథియోపియా, కెన్యా, కాంబోడియా, ఇరాక్, జోర్డాన్ వంటి దేశాలకు చైనా భారీగా రుణాలిచ్చింది.