న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ ఇండియాలో కొవిడ్ కోసం ఇస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) అంగీకరించలేదు. అయితే తాజాగా ప్రయాణ నిబంధనలను సవరించింది. కొవిషీల్డ్ను కూడా ఆమోదించిన వ్యాక్సిన్ల జాబితాలో చేర్చింది. అయితే ఇక్కడే ఆ దేశం ఓ ట్విస్ట్ ఇచ్చింది. కొవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు కూడా క్వారంటైన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. దీనిపై యూకే స్పందిస్తూ.. సమస్య కొవిషీల్డ్ కాదని, ఇండియాలోని వ్యాక్సినేషన్ సర్టిఫికేషన్పై అనుమానాలే అసలు సమస్య అని చెప్పడం గమనార్హం.
ఇండియా వ్యాక్సిన్ సర్టిఫికేషన్ను గుర్తించేందుకు ఇండియాతో కలిసి పని చేస్తున్నట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. కొవిషీల్డ్ను గుర్తించకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇండియా హెచ్చరించిన తర్వాతే యూకే ఆ వ్యాక్సిన్ను గుర్తించినా.. తాజాగా సర్టిఫికెట్పై అనుమానాలు వ్యక్తం చేయడం కొత్త సమస్యకు తెరలేపింది.