లండన్: బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రిన్స్ ఫిలిప్ మృతికి నివాళిగా ఇవాళ పలు నగరాల్లో గన్ సెల్యూట్ ఇవ్వనున్నారు. లండన్, ఎడిన్బర్గ్, కార్డిఫ్, బెల్ఫాస్ట్తో పాటు స్పెయిన్లోని జీబ్రాల్టర్, వివిధ యుద్ధనౌకలు కూడా గన్ సెల్యూట్లో పాల్గొనున్నాయి. గన్ సెల్యూట్లో భాగంగా 41 రౌండ్ల బుల్లెట్లను ఫైర్ చేయనున్నారు. నిమిషానికి ఒక రౌండ్ చొప్పున కాల్చనున్నారు. ప్రిన్స్ ఫిలిప్కు నివాళిగా హెచ్ఎంఎస్ డైమండ్, హెచ్ఎంఎస్ మాన్ట్రోజ్లు గన్ సెల్యూట్తో గౌరవ వందనం చేయనున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమంలో నావెల్ ఆఫీసర్గా ప్రిన్స్ ఫిలిప్ చేశారు. ఆన్లైన్, టీవీల్లో గన్ సెల్యూట్ను ప్రసారం చేయనున్నారు.
ప్రిన్స్ ఫిలిప్ శుక్రవారం ఉదయం విండ్సన్ కోటలో చనిపోయినట్టు రాజకుటుంబీకుల నివాసమైన బకింగ్హమ్ ప్యాలెస్ వెల్లడించింది. ఫిలిప్ వయస్సు 99 ఏండ్లు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 16న గుండె సంబంధిత వ్యాధితో కింగ్ ఎడ్వర్డ్ దవాఖానలో చేరి 28 రోజుల పాటు చికిత్స తీసుకొన్నారు. మార్చి 16న డిశ్చార్జి అయ్యారు. ఫిలిప్ను డ్యూక్ ఆఫ్ ఎడిన్బరో అని కూడా పిలుస్తారు. ఆయన 1921 జూన్ 10న గ్రీక్ రాజకుటుంబంలో జన్మించారు. 1947లో ఎలిజబెత్ను పెండ్లి చేసుకొన్నారు. తరువాత ఐదేండ్లకు ఎలిజబెత్ రాణి అయ్యారు. కరోనా నేపథ్యంలో ఫిలిప్, రాణి కొంతకాలంగా విండ్సర్ కోటలోనే ఉంటున్నారు.