న్యూఢిల్లీ : ఏ ఎన్నికలోనైనా ఏ పార్టీ అభ్యర్థులైనా.. తాము భారీ మెజార్టీతో గెలవాలని కలలు కంటారు. అందుకు తగ్గ కృషి చేస్తుంటారు. ఎన్నో జిమ్మిక్కులకు పాల్పడుతుంటారు. కానీ కొంత మంది నాయకులకు ఎలాంటి అనుకూలతలు లేకపోయినా.. భారీ మెజార్టీ వస్తోంది. మరి కొంతమంది నాయకులకు అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో గెలుస్తుంటారు. కానీ ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు మాత్రం నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ మెజార్టీ వచ్చింది.
అసోంలోని 126 అసెంబ్లీ స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే నజీరా, బర్హంపూర్, బిజ్ని, దూధ్నోయి, టియోక్ నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులకు స్వల్ప ఓట్ల తేడాతో ప్రత్యర్థులపై గెలిచారు. వీరికి వచ్చిన మెజార్టీ నోటా ఓట్ల కంటే తక్కువ.
నజీరా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దేబబ్రాటా సైకియా.. బీజేపీ అభ్యర్థి మయూర్పై 683 ఓట్లతో గెలిచారు. ఇక్కడ నోటాకు పోలైన ఓట్లు 1470.
బర్హంపూర్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. బీజేపీ అభ్యర్థి జితూ గోస్వామి.. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ బోరాపై 751 ఓట్ల తేడాతో గెలిచారు. 1291 ఓట్లు నోటాకు వచ్చాయి.
బిజ్నీ నియోజకవర్గంలో బీపీఎఫ్ అభ్యర్థి కమల్ సింగ్.. బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్ రాయ్ చేతిలో ఓడిపోయారు. రాయ్ 1,003 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో నోటాకు పోలైన ఓట్లు 1388.
టియోక్ నియోజకవర్గంలో ఏజీపీ అభ్యర్థి రీనూపూమ రాజ్కోవా 1350 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నోటాకు ఇక్కడ 1927 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా నోటాకు 2,19,578 ఓట్లు పోలయ్యాయి.