వాషింగ్టన్, జూన్ 3: అర్హులంతా కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ వినూత్న పథకాలను ప్రకటిస్తున్నారు. ‘టీకా వేసుకోండి- ఉచితంగా బీరు తాగండి’ అని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అర్హులంతా వ్యాక్సినే వేసుకునేలా చూడటమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని చెప్పారు. తాను అధికారం చేపట్టి దాదాపు నాలుగు నెలలు అవుతున్నదని, ఈ నాలుగు నెలల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరుగులు పెట్టించానని తెలిపారు. ఇప్పటి వరకు 52 శాతం మంది పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని, త్వరలో జరుగనున్న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం నాటికి 70 శాతం మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. మనమంతా టీకాలు తీసుకుందామని, కరోనా వైరస్ నుంచి విముక్తి పొందుదామని బైడెన్ పిలుపునిచ్చారు.