హైదరాబాద్ : నగరంలో బోనాల పండుగ నిర్వహణకు రూ. 15 కోట్లు విడుదల చేశామని, చందాలు ఎవరూ వసూలు చేయొద్దని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. బోనాల ఉత్సవ ఏర్పాట్లపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీపీ మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. హైదరాబాద్కు తలమానికంగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని, కరోనా కారణంగా గత ఏడాది బోనాల ఉత్సవాలను నిర్వహించలేదన్నారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్ మార్గదర్శకాల మేరకు బోనాల సంబరాలను జరుపుకునేలా అన్నిశాఖల అధికారుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు.
బోనాలు జరిగే అన్ని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, రహదారులను శుభ్రంగా ఉండేలా చూడాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. విజయవంతంగా బోనాల ఉత్సవాలను నిర్వహించాలన్నారు. గంగ, జమున, తెహజీబ్ సంస్కృతికి నిలయమైన హైదరాబాద్ నగరంలో అందరూ ప్రశాంతంగా బోనాలు నిర్వహించుకోవాలని, పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని మంత్రులు కోరారు.
జూలై 11న గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద జూలై 25న బోనాలు, జూలై 26న రంగము నిర్వహిస్తారు. హైదరాబాద్ లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారికి ఆగస్టు ఒకటో తేదీన బోనం సమర్పించి, ఆ మరుసటి రోజు బోనాల ఉరేగింపును నిర్వహిస్తారు.