హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ఈటల రాజేందర్ స్వార్థం కోసమే బీజేపీలో చేరారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని టీఆర్ఎస్ ఎన్నారై విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం విమర్శించారు. తన వ్యక్తిగత ఆస్తుల రక్షణ కోసం ప్రజల్ని పట్టించుకోని బీజేపీలో చేరడంతో ఈటల నిజస్వరూపం బట్టబయలైందన్నారు. కరోనా కట్టడిలో విఫలమైన ప్రధాని మోదీ రాజీనామా చేయాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్న క్రమంలో ఈటలకే బీజేపీ ఎందుకు గొప్పగా కనిపించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీపైన, సీఎం కేసీఆర్పైనా ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడినా ప్రజలు తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. హుజూరాబాద్ ప్రజల మీద సీఎం కేసీఆర్కు ప్రత్యేక ప్రేమ ఉన్నదని, దేశమంతా కీర్తిస్తున్న రైతుబంధు పథకాన్నిఅక్కడే ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖ నుంచి గ్రామ కార్యకర్త వరకు హుజూరాబాద్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి గెలుపు కోసం పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.