భారత్లో నిర్వహించగలమని బీసీసీఐ ధీమా
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని బీసీసీఐ ధీమా వ్యక్తం చేసింది. అయితే అక్టోబర్లో జరుగాల్సిన మెగాటోర్నీ తొమ్మిది వేదికల్లో కాకుండా ఐదు నగరాలకే పరిమితం చేయాలని భావిస్తున్నది. ఈ విషయాన్ని బీసీసీఐ ఆఫీస్ బేరర్ ఒకరు శుక్రవారం వెల్లడించారు. అలాగే టోర్నీని యూఏఈకి తరలించడంపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘ఇంకా టోర్నీకి ఐదు నెలల సమయం ఉంది. టీ20 ప్రపంచకప్ భారత్లోనే నిర్వహించగలిగే పరిస్థితిలో ఉన్నాం. దేశంలో ఇప్పటికే వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. అయితే టోర్నీని తొమ్మిది వేదికల్లో కాకుండా ఐదుకే కుదించాలని ఆలోచిస్తున్నాం’అని ఆయన అన్నారు.