హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): మూడోదశ వ్యాక్సినేషన్లో భాగంగా మే 1 నుంచి 18-44 ఏండ్ల మధ్య వయస్కులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ వయస్సు మధ్యవారు రాష్ట్రంలో 1.72 కోట్లమంది ఉంటారని అంచనా. వీరికి మొదటి డోసు వ్యాక్సినేషన్కు కనీసం రెండుకోట్ల టీకాలు అవసరం. రెండు డోసులకు నాలుగు కోట్లు కావాలి. దీనికి 44 ఏండ్లు పైబడిన వారిలో మొదటిడోసు తీసుకోనివారు, రెండో డోసు తీసుకోవాల్సినవారు అదనం. ఇంత పెద్దసంఖ్యలో లబ్ధిదారులుండగా.. కేంద్రం మాత్రం మూడోదశ వ్యాక్సినేషన్ ప్రారంభించాలంటూ కేవలం 4.4 లక్షల డోసులు కేటాయించింది. 1.72 కోట్లమందికి 4.4 లక్షల డోసులు ఎలా పంపిణీ చేయాలో తెలియక వైద్యారోగ్యశాఖ అధికారులు సతమతమవుతున్నారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేశారు. దీంతో మూడోదశ టీకా తీసుకోవాల్సినవారు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుండగా.. మొదటి, రెండోదశలో వ్యాక్సిన్ తీసుకున్నవారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రెండోడోసు కోసం వీరంతా వ్యా క్సిన్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. రెండుడోసుల మధ్య సమయం పెరిగిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. నామమాత్రంగా కేటాయించిన వ్యాక్సిన్లను ఎవరికివ్వాలి? ఏ వర్గానికి ప్రాధాన్యమివ్వాలి? ఎలా పంపిణీ చేయాలన్న దానిపై అధికారుల్లో సందిగ్ధం మొదలైంది. టీకా పంపిణీని సీరియస్గా తీసుకున్న రాష్ట్రప్రభుత్వం తెలంగాణ జనాభాకు సరిపడా డోసులు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాసినట్టు సమాచారం.దీంతోపాటు వచ్చిన కొద్దిపాటి వ్యాక్సిన్ను ప్రాధాన్యక్రమంలో ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నది.
మూడోదశలో ముందుగా వీరికే..
18 నుంచి 44 ఏండ్ల వారిలో వైరస్ను ఎక్కువగా వ్యాప్తి చెందించేవర్గాలకు మూడోదశ వ్యాక్సిన్ను ముందుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. దీనివల్ల వైరస్ వ్యాప్తిని కొంతవరకైనా అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నది. ఈ వర్గంలో సూపర్ స్ప్రెడర్స్గాఉన్న చిరువ్యాపారస్తులు, ఫుడ్డెలివరీ బాయ్స్, డ్రైవర్లు తదితరులు ఉంటారని సమాచారం. వీరికి వ్యాక్సినేషన్ ముగిసిన తర్వాత మరో ప్రాధాన్యవర్గాన్ని నిర్ణయించనున్నది. ఇలా చేయడం వల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గందరగోళం తగ్గడంతోపాటు, రెండోడోసు వ్యాక్సిన్ కోసం ఇబ్బందుల్లేకుండా చూడటం సాధ్యమవుతుందని వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నిర్ణయంపై పూర్తిస్థాయిలో చర్చించాక స్పష్టత రానున్నది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు ఆరోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు.