రాష్ర్టానికి నష్టం జరిగితే సీఎం ఊరుకోరు: మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎలాంటి అనుమతి లేకుండానే ఆర్డీఎస్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం కుడి కాలువ నిర్మాణం చేపట్టిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. తెలంగాణకు చిన్న నష్టం జరిగినా సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోబోరని స్పష్టంచేశారు. మహబూబ్నగర్లో బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం చేపట్టడం సరైన చర్య కాదన్నారు. కేంద్రం, కృష్ణా బోర్డు అనుమతి లేకుం డా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి అనుమతి ఉందంటూ పనులు ప్రారంభించారని విమర్శించారు. ఏపీ చర్యల వల్ల తెలంగాణలోని అసలైన ఆయకట్టు రైతులకు ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. మూడు రాష్ర్టాల మధ్య ఉన్న అంశం కాబట్టి దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.