ఢాకా: ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్ పర్యటన కొనసాగుతున్నది. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం బంగ్లాదేశ్కు వెళ్లిన ప్రధాని తొలిరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండో రోజైన శనివారం ఉదయాన్నే సట్ఖారీ జిల్లా ఈశ్వర్పూర్లోని జెశోరేశ్వరీ కాళీ టెంపుల్ను సందర్శించారు. అక్కడ అమ్మవారికి పూజలు నిర్వహించి చేతితో తయారు చేసిన కిరీటాన్ని తొడిగారు. వెండిపై బంగారం కోటింగ్ వేసిన తీగలను చేతిలో అల్లడం ద్వారా ఈ కిరీటాన్ని తయారు చేశారు. సంప్రదాయ కళారీతిలో ఈ కిరీటాన్ని అల్లడానికి మూడు వారాలకు పైగా సమయం పట్టిందట.
జెశోరేశ్వరీ అమ్మవారికి పూజల అనంతరం మాట్లాడిన ప్రధాని.. తనకు ఇవాళ కాళీ మాత దర్శన భాగ్యం కలిగిందన్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచ మానవాళికి ఆ గండం నుంచి విముక్తి కల్పించమని తాను కాళీ మాతను కోరుకున్నట్లు ప్రధాని వెల్లడించారు. బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఆలయ పరిసరాల్లో ఒక కమ్యూనిటీ హాల్ను అవసరమని, ఆ హాల్ను నిర్మాణాన్ని భారత ప్రభుత్వమే చేపడుతుందని చెప్పారు.
కాళీ మేళా సందర్భంగా బంగ్లాదేశ్ నుంచి, భారత సరిహద్దుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడి తరలివస్తారని, అలా వచ్చే భక్తులకు కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. సామాజిక, మత సంబంధమైన, విద్యా సంబంధమైన పలు కార్యక్రమాలకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హాల్ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తుఫాన్ల లాంటి విపత్తులు సంభవించినప్పుడు కమ్యూనిటీ హాల్ ఒక షెల్టర్గా ఉపయోగపడుతుందన్నారు.