కార్బిస్ బే (ఇంగ్లండ్), జూన్ 13: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని బయటపడేసేందుకు కలిసికట్టుగా పోరాడాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పేద దేశాలకు 100 కోట్ల డోసుల టీకాలను అందజేయనున్నట్టు ప్రకటించాయి. మూడు రోజులపాటు సాగిన జీ7 సదస్సు ఆదివారంతో ముగిసింది. ప్రపంచదేశాలకు కరోనా వ్యాక్సిన్, పర్యావరణ మార్పులు, చైనాలో మానవహక్కుల ఉల్లంఘన, బహుళజాతి కంపెనీలపై కనీస పన్ను తదితర అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే ఏడాది చివరి నాటికి పేద దేశాలకు 100 కోట్ల డోసులను అందించనున్నట్టు నేతలు ప్రకటించారు. మరోవైపు, చైనా అభివృద్ధి చేస్తున్న ‘బెల్ట్ అండ్ రోడ్’ ప్రాజెక్టుకు స్పందనగా జీ7 దేశాలు ‘బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ ది వరల్డ్’ పేరుతో పలు దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించనున్నాయి. పన్నులకు స్వర్గధామంగా ఉన్న దేశాలను ఉపయోగించుకుని బహుళజాతి కంపెనీలు పన్నులను ఎగవేస్తున్న నేపథ్యంలో వాటిపై 15 శాతం కనీస పన్ను విధించాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. జీ7కు భారత్ సహజ భాగస్వామి: మోదీ జీ7 దేశాలకు భారత్ సహజ మిత్రదేశమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం జీ7 సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛకు భారత్ కట్టుబడి ఉన్నదని పేర్కొన్నారు.‘ఒకే పుడమి.. ఒకే ఆరోగ్యం’ అనే భావనతో కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాగా, టీకాలపై పేటెంట్ హక్కులు రద్దు చేయాలన్న భారత ప్రతిపాదనకు జీ7లో విశేష స్పందన లభించింది.