వచ్చే ఏడాది నుంచి హైస్కూళ్లలో ప్రత్యేక సబ్జెక్టు :ఎన్సీఈఆర్టీ
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ) : పాఠశాల దశనుంచే విద్యార్థులకు కృతిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) ను బోధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత సాంకేతిక యుగంలో అన్నిరంగాల్లోనూ విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న ఈ టెక్నాలజీపై చిన్నతనం నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలని భావిస్తున్నది. నూతన విద్యావిధానంలో (ఎన్ఈపీ) భాగంగా హైస్కూల్ దశలోని విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఒక సబ్జెక్టుగా అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ సబ్జెక్టు పాఠ్యప్రణాళిక తయారీపై జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) కసరత్తు చేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని 4,668 ప్రభుత్వ, 6,373 ప్రైవేటు పాఠశాలల్లో ఏఐను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కొన్ని సీబీఎస్ఈ స్కూళ్లల్లో ఏఐ సబ్జెక్టును బోధిస్తున్నారు. 2019-20 సంవత్సరం నుంచి 9వ తరగతి, 2020-2021 నుంచి 11వ తరగతిలో దీనిని ప్రవేశపెట్టారు.