ముంబై: మే 18: ఈక్విటీ మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న కన్సాలిడేషన్ కారణంగా 2021 ద్వితీయార్థంలో మెరుగైన రాబడులు వచ్చే అవకాశాలుంటాయని అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం మోర్గాన్స్టాన్లీ పేర్కొంది. ఈక్విటీ రాబడులకు సంబంధించి ఆర్థికాభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, ప్రభుత్వ విధానాలు, ఆర్బీఐ పాలసీ, కార్పొరేట్ లాభాలు వంటి ఫండమెంటల్ అంశాలు సానుకూలంగా వున్నాయని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు చెపుతూ ఈ సంవత్సరాంతానికి సెన్సెక్స్ లక్ష్యం 55,000 పాయింట్లుగా అంచనావేసారు. ఈ లక్ష్యం సాధించే అవకాశాలు 50 శాతం వరకు వున్నాయని, బుల్స్ కదంతొక్కితే సెన్సెక్స్ 2021 డిసెంబర్కల్లా 61,000 పాయింట్లను చేరుకోగలదని, ఈ ఛాన్స్ 30 శాతం మాత్రమే వుందని, బేర్స్ పట్టుబిగిస్తే సూచి 41,000 పాయింట్ల వద్దకు పడిపోగలదని, ఈ ప్రమాదం 20 శాతం మేర వుందని మోర్గాన్ స్టాన్లీ అంచనాల్లో పేర్కొంది.
కరోనా సంక్షోభం పూర్తిగా సమసిపోవడం, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, అంతర్జాతీయ బ్యాంకులు సరళ విధానాల కొనసాగింపు వంటివి బుల్ మార్కెట్కు దారితీస్తాయని, ఈ ఏడాది ద్వితీయార్థంలో కూడా అధిక కొవిడ్ కేసులు నమోదుకావడం, భారత్ తగిన విధానాలు అవలంబించకపోవడం, వృద్ధిరేటు క్షీణించడం వంటివి బేర్ మార్కెట్కు కారణమవుతాయని బ్రోకింగ్ సంస్థ వివరించింది.భారత్ వాస్తవ జీడీపీ వృద్ధిరేటు, 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ మధ్య వున్న వ్యత్యాసం&ఈక్విటీలు మరింత పెరిగేందుకు కారణమవుతుందని, ఇతర వర్థమాన మార్కెట్లను భారత్ మించుతుందని విశ్వసిస్తున్నట్లు మోర్గాన్స్టాన్లీ పేర్కొంది.
రెండో రోజూ అదే జోరు&సెన్సెక్స్ 613 పాయింట్లు అప్ వరుసగా రెండోరోజు సైతం భారత్ మార్కెట్ పెద్ద ర్యాలీ జరిపింది. క్రితం రోజు 800 పాయింట్లకుపైగా పెరిగిన సెన్సెక్స్ మంగళవారం మరో 613 పాయింట్లను జతచేసింది. దాంతో సూచి 50,000 మార్క్ను అధిగమించి 50,193 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 185 పాయింట్లు జంప్చేసి 15,108 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దీంతో సూచీలు రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి. సెన్సెక్స్-30 షేర్లలో అత్యధికంగా ఎం అండ్ ఎం 6 శాతం ర్యాలీ జరిపింది. బజాజ్ ఆటో, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీలు పెరిగిన షేర్లలో వున్నాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ, హెచ్యూఎల్లు నష్టపోయాయి. గడిచిన రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.5.78 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.216 లక్షల కోట్లకు చేరుకొని నూతన రికార్డును సృష్టించింది.