ముందస్తు చెల్లింపులకు ఆసక్తి
ఒకేసారి చెల్లిస్తే 5% మినహాయింపు
రాయితీ పొందుతున్న యజమానులు
పాలమూరు జిల్లాలో రూ.70 లక్షల వసూలు
భూత్పూర్ బల్దియాలోఅవగాహన కరువు
నెలాఖరు వరకే ఎర్లీబర్డ్కు అవకాశం
మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 15 : మున్సిపాలిటీ వాసులు ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నును ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ వస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో ఇండ్లు, వ్యాపార సముదాయాల యజమానులు పన్ను చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. వేలాది రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. ఈ స్కీం వర్తించాలంటే సదరు యజమానులు పన్ను బకాయి ఉండొద్దు. బకాయి ఉంటే ముందస్తు చెల్లింపులో రాయితీకి అవకాశం ఉండదు. రాయితీ పొందాలంటే పాత బకాయి, అపరాధ రుసుం చెల్లిస్తేనే అవకాశం కల్పిస్తున్నారు. కాగా, గురువారం వరకు మహబూబ్నగర్ మున్సిపాలిటీకి ఎర్లీబర్డ్ స్కీం ద్యారా రూ.60 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ఈ నెల 30 వరకు ఈ స్కీం ద్వారా రాయితీ పొందే అవకాశం కల్పించారు.
జిల్లాలో రూ.70 లక్షల ఆదాయం..
ఎర్లీబర్డ్ స్కీం ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటివరకు రూ.70 లక్షలకుపైగా ఆస్తి పన్ను వసూలైంది. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో 45,547 అసెస్మెంట్లు, 28,043 ఇండ్లు ఉన్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీలో 9,226 అసెస్మెంట్లు, 4,000 ఇండ్లు, భూత్పుర్ మున్సిపాలిటీలో 3,290 అసెస్మెంట్లు, 1200 ఇండ్లు ఉన్నాయి. మహబూబ్నగర్లో రూ.60 లక్షలకుపైగా, జడ్చర్లలో రూ.10 లక్షల పన్ను వసూలైంది. భూత్పుర్లో కేవలం రూ.6 వేలు మాత్రమే వసూలైనట్లు మేనేజర్ అశోక్రెడ్డి తెలిపారు. అయితే, భూత్పూర్ మున్సిపాలిటీలో ఈ స్కీంపై ప్రచారం కల్పించడంలేదు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పెద్ద సంఖ్యలో పన్ను చెల్లించేందుకు వస్తున్నారు. అయితే, ఆన్లైన్ సమస్యతోపాటు పురపాలికలో హ్యాండ్ మిషన్ను తక్కువగా పెట్టడడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యలో అధికారులు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.