న్యూఢిల్లీ : దేశంలో త్వరలోనే మరో విదేశీ టీకా అందుబాటులోకి రానున్నది. ఎమర్జెన్సీ వినియోగం కోసం అమెరికాకు చెందిన మోడెర్నా టీకా దిగుమతి, మార్కెటింగ్కు ముంబైకి చెందిన సిప్లా కంపెనీకి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) మంగళవారం అనుమతులు మంజూరు చేసింది. దేశంలో అందుబాటులోకి రానున్న నాలుగో టీకా ఇది. తమ భారత భాగస్వామి సిప్లా ద్వారా మోడెర్నా సంస్థ దరఖాస్తు చేసిందని, పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆ టీకాకు అనుమతులు మంజూరు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఫైజర్, జే అండ్ జే వ్యాక్సిన్లనూ భారత్కు తీసుకురావడంపై చర్చలు కొనసాగుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు పాల్ వెల్లడించారు.
కొవాక్స్ ద్వారా సరఫరా
అంతర్జాతీయ టీకా సరఫరా కూటమి ‘కొవాక్స్’ ద్వారా భారత్కు తమ టీకాలు అందజేసేందుకు అమెరికా ప్రభుత్వం నిర్ణయించిందని మోడెర్నా సంస్థ గత ఆదివారం డీసీజీఐకి తెలిపింది. ఇందుకు అనుమతులు ఇవ్వాలని కోరింది. సోమవారం మోడెర్నా తరఫున సిప్లా కంపెనీ డీసీజీఐకి దరఖాస్తు చేసింది. దేశంలో టీకాల కొరత నేపథ్యంలో వ్యాక్సిన్ అనుమతుల ప్రక్రియను కేంద్రం సరళతరం చేసింది. అమెరికాకు చెందిన ఎఫ్డీఏ, ఈఎంఏ, బ్రిటన్కు చెందిన ఎంహెచ్ఆర్ఏ, జపాన్కు చెందిన పీఎండీఏతోపాటు డబ్ల్యూహెచ్వో అనుమతులు లభించిన టీకాలకు భారత్లో బ్రిడ్జి ట్రయల్స్ నిర్వహించకుండానే అనుమతులు మంజూరు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
వేర్వేరు టీకాలతో మెరుగైన రక్షణ
లండన్: టీకాల మిక్సింగ్తో కరోనా నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో తేలింది. అస్ట్రాజెనెకా రెండు డోసులతో పోలిస్తే.. ఒకటి అస్ట్రాజెనెకా, మరొకటి ఫైజర్ టీకా ఇవ్వడం వల్ల మరింత రోగ నిరోధకత లభిస్తుందని వెల్లడైంది. 830 మంది వలంటీర్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. తొలుత ఫైజర్, అనంతరం అస్ట్రాజెనెకా టీకా ఇవ్వడంతో పోలిస్తే.. మొదట అస్ట్రాజెనెకా, తర్వాత ఫైజర్ టీకా ఇవ్వడం వల్ల యాంటీబాడీలు మరింతగా వృద్ధి చెందినట్టు అధ్యయనంలో తేలింది.
అస్ట్రాజెనెకా డోసుల మధ్య 11 నెలల వ్యవధితో 18 రెట్లు యాంటిబాడీలు
లండన్: అస్ట్రాజెనెకా టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని 11 నెలలకు పెంచితే యాంటిబాడీలు 18 రెట్లు ఎక్కువ వృద్ధి చెందుతాయని తాజా అధ్యయనంలో తేలింది. అలాగే బూస్టర్ డోస్ ఇవ్వడం వల్ల రోగ నిరోధకత మరింత పెరుగుతుందని వెల్లడైంది. ప్రస్తుతం ఈ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలుగా నిర్ణయించారు. 12 వారాల వ్యవధితో పోలిస్తే.. 11 నెలల వ్యవధితో 4 రెట్లు అధికంగా యాంటిబాడీలు వృద్ధి చెందినట్టు పరిశోధకులు గుర్తించారు.