న్యూఢిల్లీ: పాత వాహనాల స్క్రాపేజీ విధానం అమలు చేయడం కష్ట సాధ్యం అని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఏడాది కాలంగా కష్టాల కూడలిలో ఉన్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం స్ర్కాపేజీ పాలసీని తెచ్చింది.
స్క్రాపేజీ పాలసీ కింద పాత వాహనాల స్థానే కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి ధరలో ఐదు శాతం రాయితీ ఇవ్వాలని ఆటోమొబైల్ సంస్థలను కేంద్రం కోరింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో కేంద్రం అమలు చేస్తున్న స్క్రాపేజీ పాలసీ కింద కొత్త వాహనాల కొనుగోళ్లపై ఐదు శాతం రాయితీ ఇవ్వడం కష్ట సాధ్యం అని శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.
టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎకనామిక్ కాంక్లేవ్-2021లో శశాంక్ శ్రీవాత్సవ మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో స్క్రాపేజీ పాలసీ అమలు చేయడం అంత తేలిక కాదన్నారు. ప్రస్తుతం లభిస్తున్న లాభాల స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే కొత్త వాహనాల కొనుగోలుపై ఐదు శాతం రాయితీ కొంచెం కష్టమేనన్నారు.
మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ కం సీఈవో పవన్ గోయెంకా మాట్లాడుతూ.. విద్యుత్ వాహనాల వినియోగం శరవేగంగా పెరుగనున్నదని, అయితే, విద్యుత్ వాహనాల మౌలిక వసతుల కల్పన ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ప్రత్యేకించి చార్జింగ్ ఫెసిలిటీలు మరింత మెరుగు పడాల్సి ఉందన్నారు. అలాగని కస్టమర్లు విద్యుత్ వాహనాల వైపు మళ్లకపోవడాన్ని తప్పు పట్టలేమన్నారు.
ఈ చర్చాగోష్టిలో హ్యుండాయ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ తరుణ్ గార్గ్, ఎంజీ మోటార్స్ ఎండీ కం ప్రెసిడెంట్ రాజీవ్ చాబా తదితరులు పాల్గొన్నారు. కరోనా అనంతర ప్రపంచంలో భవిష్యత్ వాహనాల వినియోగం, ఆటోరంగం భవితవ్యంపై చర్చ జరిగింది.
సుప్రీంతీర్పు.. మా నైతికతకు, వాస్తవాలకు రికగ్నిషన్: రతన్ టాటా
ధరలకనుగుణంగా ముడి చమురు దిగుమతి పాలసీ: ధర్మేంద్ర ప్రధాన్
రిలయన్స్-ఆరామ్కో డీల్ మరింత జాప్యం.. ఎందుకంటే!