న్యూఢిల్లీ, జూన్ 28: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సన్నబడ్డారు. ఆయన సన్నబడ్డారని అక్కడి ప్రజలు కండ్ల నీళ్లు పెట్టుకొంటున్నారు. తమ అధినేత ఆరోగ్యం బాగా లేదేమోనని బాధపడుతున్నారు. కిమ్ బాగా సన్నబడ్డట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. అది నిజమేనని తాజాగా ఉత్తర కొరియా అధికార మీడియా స్పష్టతనిచ్చింది. ‘మా అధినేత బాగా సన్నబడిపోవటం చూసి గుండె తరుక్కుపోతున్నది. దేశంలో ప్రతి ఒక్కరూ ఇదే విషయంపై చర్చించుకొంటున్నారు. కిమ్ను చూసి కన్నీరు పెట్టుకొన్నామని చాలా మంది చెప్పారు’ అని పేర్కొన్నది. కిమ్ ఈ మధ్య జరిగిన పార్టీ ప్లీనరీలో అధికారులతో సమావేశం అయ్యారు. ఆ వీడియోలను మీడియా ప్రసారం చేసింది.