తమ సాఫ్ట్వేర్ను సమర్థించుకున్న ఎన్ఎస్వో
న్యూఢిల్లీ: పెగాసస్ నిఘా సాఫ్ట్వేర్పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండగా, దానిని అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్వో మాత్రం తమ సాఫ్ట్వేర్ను సమర్థించుకున్నది. ఇలాంటి సాంకేతికత వల్లే కోట్లాది మంది ప్రజలు రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని, వీధుల్లో ధైర్యంగా నడవగలుగుతున్నారని పేర్కొన్నది. నేరాలు, ఉగ్రవాదంతోపాటు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ యాప్స్ మాటున దాక్కుని అక్రమంగా చైల్డ్ పోర్నోగ్రపీకి పాల్పడుతున్న ముఠాలను కట్టడిచేసేందుకు, విచారించేందుకు పెగాసస్ వంటి సాఫ్ట్వేర్లు దర్యాప్తు సంస్థలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించింది. ఈ టెక్నాలజీని తాము ఆపరేట్ చేయబోమని, అలాగే తమ క్లయింట్లు సేకరించే డాటా కూడా తమకు అందుబాటులో ఉండదని స్పష్టంచేసింది. ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచేందుకు తాము సాధ్యమైనదంతా చేస్తున్నామని సంస్థ ప్రతినిధి తెలిపారు. సాఫ్ట్వేర్ను భారత్కు విక్రయించారా అన్న ప్రశ్నకు ఆ అధికారి సూటిగా సమాధానమివ్వలేదు.