టోక్యో: ఈ ఏడాది జులైలో ప్రారంభం కాబోయే ఒలింపిక్ గేమ్స్లో పాల్గొనే అథ్లెట్లు, ఇతర పార్టిసిపెంట్స్కు వ్యాక్సిన్లు ఇవ్వడానికి చైనీస్ ఒలింపిక్ కమిటీ ముందుకు వచ్చినట్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వెల్లడించింది. ఈ ఏడాది జరగబోయే సమ్మర్ ఒలింపిక్స్తోపాటు వచ్చే ఏడాది బీజింగ్ ఆతిథ్యమిచ్చే వింటర్ ఒలింపిక్స్లో పాల్గొనే వారికి ఈ టీకాలు ఇస్తామని చైనీస్ ఒలింపిక్ కమిటీ చెప్పినట్లు ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాక్ తెలిపారు. గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్లో కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన విషయం తెలిసిందే.
జులై 23 నుంచి ఆగస్ట్ 8 వరకూ జపాన్ రాజధాని టోక్యోలో ఈ గేమ్స్ జరగనున్నాయి. ఆ తర్వాత ఆరు నెలలకే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్లో 10 వేల మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటారు. అయితే అంతకు ఎన్నో రెట్ల మంది గేమ్స్ నిర్వహణలో భాగం పంచుకుంటారు. అయితే చైనా వ్యాక్సిన్లను వాడటానికి సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు టోక్యో గేమ్స్ సీఈవో తొషిరో మ్యూటో సమాధానం చెప్పలేదు. ఇది జపాన్ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు.