‘సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. మారటోరియం అన్నది పూర్తిగా బ్యాంకుల పరిధిలోని వాణిజ్యపరమైన నిర్ణయం. ఈ విషయంలో బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావడం అస్సలు మంచిది కాదు’
-ఉదయ్ కొటక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ
న్యూఢిల్లీ, మార్చి 23: మారటోరియం పొడిగింపు అంశంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అది కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన నిర్ణయమని మంగళవారం తేల్చిచెప్పింది. అలాగే మారటోరియంలో రుణాలపై పూర్తిగా వడ్డీని మాఫీ చేయాలని కూడా చెప్పలేమన్న అత్యున్నత న్యాయస్థానం.. మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ)ల వర్గీకరణలోనూ తలదూర్చబోమన్నది. మారటోరియం వ్యవధిని పొడిగించాలంటూ నిర్మాణ, విద్యుత్తు రంగాలు, ఇతర వర్తక-వాణిజ్య సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే పైవిధంగా స్పందించింది. ఈ కేసులో కేంద్ర ఆర్థిక విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్ష జరుపలేమన్నది. నిజానికి కరోనా వైరస్.. అన్ని రంగాలనూ ప్రభావితం చేసిందని, ప్రభుత్వానికీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తప్పలేదని గుర్తుచేసింది. కొవిడ్-19 నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి ఆగస్టు వరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలపై మారటోరియం విధించుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఈ 6 నెలలు ఈఎంఐలను రుణగ్రహీతలు వాయిదా వేసుకున్నారు. అయితే ఆగస్టు 31తో మారటోరియం వ్యవధి ముగిసిపోగా.. ఆ తర్వాత కూడా ఈ వెసులుబాటును కల్పించాలని పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు.
చక్రవడ్డీ వద్దు
మారటోరియం వ్యవధిలో ఏ రుణగ్ర
హీతపైనా చక్రవడ్డీ భారం వేయొద్దని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. ఈఎంఐలపై 6 నెలల మారటోరియంను తీసుకున్న వారిపై బ్యాంకులు, ఇతర రుణదాతలు వడ్డీపై వడ్డీ లేదా చక్రవడ్డీని విధించిన సంగతి విదితమే. అయితే రూ.2 కోట్ల వరకు రుణాలు తీసుకున్నవారికి చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసింది. తాజాగా సుప్రీం కోర్టు ఆపై రుణగ్రహీతలకూ మాఫీని వర్తింపజేయాలని ఆదేశించింది. ఇప్పటికే చక్రవడ్డీని వసూలు చేసినైట్లెతే తిరిగిచ్చేయాలని, లేదంటే తదుపరి ఈఎంఐల్లో సర్దుబాటు చేయాలని సూచించింది.
7,500 కోట్ల భారం
రూ.2 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నవారికీ మారటోరియం వ్యవధిలో చక్రవడ్డీని మాఫీ చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశంతో రుణదాతలపై అదనంగా రూ.7వేల కోట్ల నుంచి 7,500 కోట్ల వరకు భారం పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ.2 కోట్లలోపు రుణగ్రహీతలకు చక్రవడ్డీని మాఫీ చేయడం వల్ల రూ.6,500 కోట్ల భారం పడిందని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు సుప్రీం కోర్టు తాజా ఆదేశం నేపథ్యంలో మొండి బకాయిలు రూ.1.3 లక్షల కోట్లు పెరిగే వీలుందని బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.