12 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి నాంపల్లి ప్రత్యేక కోర్టు పోక్సో చట్టం కింద 3 ఏండ్ల జైలు, రూ. వెయ్యి జరిమానా విధించింది. కార్ఖాన ఇన్స్పెక్టర్ మధుకర్స్వామి వివరాల ప్రకారం.. 2013లో కార్ఖానలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన శంకర్లాల్ (53) బాలాజీ హాట్ చిప్స్ దుకాణపు యాజమాని. ఇదే కాలనీకి చెందిన 12 ఏండ్ల బాలికను టెంట్ హౌస్ పక్కకు బలవంతంగా తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. టెంట్ హౌజ్లో ఉన్న సికిందర్, అతడి స్నేహితులు శంకర్లాల్ను పట్టుకుని కార్ఖాన పోలీసులకు అప్పగించారు. అప్పటి ఇన్స్పెక్టర్గా ఉన్న రవికుమార్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. అనంతరం చార్జిషీట్ను కోర్టులో దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో కేసు విచారణ జరుగుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గా జీ బాలిక తరపున వాదనలు వినిపించారు. 8 ఏళ్లపాటు సాగిన కేసు విచారణలో 15 మంది సాక్షులను విచారించిన నాంపల్లి ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి కుంచల సునీత నేరం రుజువు కావడంతో నిందితుడికి 3 ఏండ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అదే విధంగా నిందితుడు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. సాక్షులను ఎప్పటికప్పుడు కేసులో భాగస్వామ్యం చేస్తూ నిందితుడికి శిక్ష పడేలా కార్ఖాన పోలీస్ స్టేషన్ కోర్టు అధికారులు మురళి, భార్గవి కీలక పాత్ర వహించారు. వీరిని ఇన్స్పెక్టర్ అభినందించారు.