కాబూల్: ఆఫ్థనిస్థాన్ స్వాధీనంలో తాలిబన్లకు పాకిస్థాన్ అండగా ఉందన్న సంగతి మరోసారి రుజువైంది. తాజాగా పంజ్షీర్ తమ నియంత్రణలోకి వచ్చినట్లు తాలిబన్ ప్రకటించింది. మరోవైపు పంజ్షీర్ గగనతలంపై పాకిస్థాన్ యుద్ధ విమానం చక్కర్లు కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. పాక్ డ్రోన్లు కూడా పంజ్షీర్లోని ప్రతిఘటన దళాలపై బాంబులతో దాడి చేసినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పంజ్షీర్లో తాలిబన్లకు పాకిస్థాన్ సహాయం చేసిన విషయం బయటపడింది.
ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ నాయకుడు అహ్మద్ మసూద్ సోమవారం ఒక సందేశాన్ని విడుదల చేశారు. పంజ్షీర్లో పాకిస్థాన్, తాలిబన్లు కలిసి దాడి చేశారని చెప్పారు. ఈ దాడిలో ఫహీమ్తోపాటు తన కుటుంబంలోని పలువురు మరణించినట్లు తెలిపారు. పాకిస్థాన్ నేరుగా దాడి చేస్తున్నా అంతర్జాతీయ సమాజం మౌనంగా చూస్తున్నదని ఆరోపించారు. తమ చివరి రక్తం బొట్టు చిందేవరకు తాలిబన్లపై పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. తాలిబన్లకు వ్యతిరేకంగా జాతీయ తిరుగుబాటును లేవనెత్తాలని ఆఫ్ఘన్ ప్రజలకు పిలుపునిచ్చారు.