హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): అధిక చార్జీలు వసూలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ దవాఖానలపై ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐదు దవాఖానల కొవిడ్ లైసెన్స్ రద్దు చేయగా.. శనివారం మరో ఐదు దవాఖానలపై వేటువేసింది. అధిక బిల్లులు, ఇతర సేవాలోపాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం తాజాగా ఐదు దవాఖానల కొవిడ్ చికిత్స అనుమతులను రద్దు చేసినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకున్న దవాఖానల సంఖ్య 10కి పెరిగింది. మరో 15 దవాఖానలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ చికిత్సలో లోపాలపై ప్రవేశపెట్టిన వాట్సాప్ నంబర్ 9154170960కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొత్తం 27 షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించింది. ఆయా హాస్పిటళ్ల యాజమాన్యం ఇచ్చిన వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
వేటుపడిన దవాఖానలు
ఇమేజ్ హాస్పిటల్ (అమీర్పేట)
అంకుర హాస్పిటల్ (ఎల్బీనగర్)
సియాలైఫ్ హాస్పిటల్ (కొండాపూర్)
పంచవటి హాస్పిటల్
(భూత్పూర్-మహబూబ్నగర్)
సాయిసిద్ధార్థ హాస్పిటల్
(షాపూర్నగర్)
ఈ నెల 26వ తేదీ నాటికి వచ్చిన ఫిర్యాదులు – 88
నోటీసులు అందుకొన్న
దవాఖానల సంఖ్య – 64
ఈ నెల 27-29 తేదీల మధ్య వచ్చిన ఫిర్యాదులు – 27
నోటీసులు అందుకొన్న
దవాఖానల సంఖ్య – 15
మొత్తం ఫిర్యాదులు – 115
నోటీసులు అందుకొన్న
దవాఖానలు – 79
కొవిడ్ చికిత్స రద్దయిన
దవాఖానలు – 10