ఘట్కేసర్, ఏప్రిల్ 11: కథలు చెబుతారు.. ఆటలు ఆడిస్తారు… చక్కగా పాఠాలూ బోధిస్తారు.. ఇలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది విద్యాశాఖ. ఉత్సాహవంతంగా విద్యనందిస్తే..ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లాలనే ఆసక్తి విద్యార్థుల్లో కలుగుతుందన్న ఉద్దేశంతో నూతన ఒరవడికి నాందిపలికింది. వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు పెంపొందించడం వంటి ప్రధానాంశాలకు ప్రాధాన్యతనిస్తూ, విద్యాబోధన జరుగాలన్న లక్ష్యంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘హరివిల్లు’ పేరిట ఈ వినూత్న బోధనను అమలు చేయనున్నది.
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో హరివిల్లు(జాయ్ఫుల్ లెర్నింగ్) అనే కొత్తవిధానంలో విద్యాబోధన కోసం జిల్లాలోని 397 పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణను జూమ్ ద్వారా కొనసాగించారు. వారిని మూడుబ్యాచ్లుగా విభజించి ట్రైనింగ్ ఇచ్చారు.
విద్యార్థుల హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆట పాటలు, చిన్న కథలతో చదువు చెబితే బడికి వచ్చేందుకు ఇష్టపడుతారని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఏకథ చెబుతారో, ఏ ఆటలు ఆడిస్తారో అని విద్యార్థుల్లో ఆసక్తి పెరిగి.. స్కూల్కు వచ్చేందుకు ఉత్సాహం చూపుతారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలయ్యే ఈ సరికొత్త బోధన ప్రతిరోజు మొదటి క్లాస్లో అమలు చేస్తారు.
విద్యార్థులకు ఉత్సాహవంతమైన బోధన అందించనున్నాం. జిల్లా ప్రాథమిక పాఠశాలల్లో హరివిల్లు కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నాం. – విజయకుమారి, జిల్లా విద్యాధికారి, మేడ్చల్ జిల్లా
హరివిల్లు కార్యక్రమం ద్వారా బోధిస్తే.. చిన్నారుల్లో ఉత్సాహం పెరుగుతుంది. వారిలో మానసిక ఉల్లాసం కలుగుతుంది. -కె.పాపిరెడ్డి, అకడమిక్ మానిటరింగ్ అధికారి, హెచ్ఎం బాలుర పాఠశాల ఘట్కేసర్