ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం( Pakistan Inflation ) అంతకంతకూ పెరిగిపోతోంది. నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. నగరాల్లోనే కాదు గ్రామాల్లోనూ అదే దుస్థితి. స్టార్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ సొంతూరైన రావల్పిండిలో ఒక్క చాయ్ ధర రూ.40కి చేరింది. దీనికి కారణం ఇండియాకు నో చెప్పడమే. ఇండియా నుంచి అత్యంత చవకగా చక్కెర లభించే అవకాశం ఉన్నా.. మన దేశం నుంచి దిగుమతులు అవసరం లేదని చెప్పి ఇప్పుడు అనుభవిస్తోంది.
చక్కెర నుంచి టీపొడి, గ్యాస్, పాలు ఇలా అన్ని ధరలు పెరిగిపోతుండటంతో చాయ్ ధర రూ.40కి చేరింది. పాలు లీటర్కు రూ.120కి చేరిందని అక్కడి చాయ్వాలా ఒకరు చెప్పాడు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1500 నుంచి రూ.3000 వరకూ ఉంది. దీంతో చాయ్వాలాలు ధరలు పెంచేశారు. ఈ ధరలు భరించలేని వాళ్లు చాయ్ తాగడమే తగ్గించేశారు. కొందరు పూర్తిగా మానేశారు. ఇది ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులను దారుణంగా దెబ్బతీసింది.
ఇండియాను కాదని..
అత్త మీద కోపం దుత్త మీద తీసినట్లు.. ఇండియాపై ఉన్న కోపం కాస్తా.. ఇప్పుడు పాక్ ప్రజలకు శాపంగా మారింది. కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకూ ఇండియా నుంచి చక్కెర, గోధుమలు వంటి నిత్యవసరాలను దిగుమతి చేసుకోబోమని పాక్ తేల్చి చెప్పింది. ఈ మధ్యే ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ 28760 టన్నుల చక్కెరను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. కిలో చక్కెరకు వాళ్లు రూ.120 చెల్లించారు. ఇంతకంటే చాలా తక్కువ ధరకే ఇండియా చక్కెరను ఇస్తామన్నా.. పాక్ వద్దంటోంది. ఫలితంగా అక్కడి ప్రజలు ధరలు పెరిగి నానా అవస్థలు పడుతున్నారు.