వరంగల్ రూరల్ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లోగానీ మరి ఏ ఇతర రాష్ట్రాల్లో గానీ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 15వ డివిజన్ లో పోతరాజపల్లిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆకులపల్లి మనోహర్ కి మద్దతుగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పార్టీ జిల్లా, నియోజక వర్గ, స్థానిక నేతలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మీ ఆశీస్సుల కోసం వచ్చాము. ఈ ఊరికి ఎమ్మెల్యే చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడూ అనేక హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చే బాధ్యత మాపై ఉంది. కేవలం 3 డివిజన్లలో దాదాపు రూ. 60 కోట్ల పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి అయితే వరంగల్ నగరంతో పోటీ పడతాయి ఈ గ్రామాలు. తెలంగాణ వస్తె ఏమి వస్తుందో చెప్పి తెలంగాణ తెచ్చుకుని ఈరోజు అవన్నీ సాధించుకుంటున్నాం.
వచ్చే ఎన్నికల నాటికి అన్ని గ్రామాల్లో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తాము. చేయలేని పార్టీలు, నేతలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని కోరుతున్నాను. మన సంక్షేమం, అభివృద్ధి ఇంకా వేగంగా జరగాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలి. టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.