కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర గురువారం రెండు ఆత్మాహుతి దాడులు( Kabul Blasts ) జరిగిన విషయం తెలుసు కదా. అయితే ఈ దాడుల వెనుక ఓ పాకిస్థానీ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుళ్లకు తామే బాధ్యులమని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ ఐఎస్ఐఎస్ పాకిస్థాన్ హెడ్ అయిన ఎమిర్ మవాలవీ అబ్దుల్లా ఫరూఖీయే ఈ దాడుల్లో కీలకపాత్ర పోషించినట్లు ఆఫ్ఘన్ వర్గాలు వెల్లడించాయి.
ఎవరీ మవాలవీ ఫరూఖీ?
ఫరూఖీకి గతంలో లష్కరే తోయిబా, తెహ్రీకే తాలిబన్లతో సంబంధాలు ఉన్నాయి. 2019, ఏప్రిల్లో ఇస్లామిక్ స్టేట్ పాకిస్థాన్ హెడ్గా మవాలవి జియావుల్ హక్ అలియాస్ అబు ఫరూఖీ ఖోర్సానీ స్థానంలో ఫరూఖీ నియమితుడయ్యాడు. 2020లో కాబూల్ గురుద్వారాలో జరిగిన పేలుడులో ఇతడే ప్రధాన సూత్రధారి. ఈ విషయాన్ని అతడు కూడా అంగీకరించాడు. పాకిస్థానే ఈ పేలుళ్లకు కారణమనీ ఫరూఖీ చెప్పాడు. కాబూల్ జైల్లో ఉన్న ఇతన్ని తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర ఉగ్రవాదులతో కలిపి విడిచిపెట్టారు. ఇప్పుడితడే ఈ కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేసినట్లు ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి.